Sunday, May 5, 2024

సుంకాలు పెంచి మేకిన్ ఇండియా అంటే కంపెనీలు వ‌స్తాయా…కేంద్రాన్ని నిల‌దీసిన కెటిఆర్

హైదరాబాద్‌ : దిగుమతి సుంకాలు పెంచి.. మేకిన్‌ ఇండియా అంటే కంపెనీలు వస్తాయా? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. బేగంపేటలో నేడు జ‌రిగిన సీసీఐ రాష్ట్ర వార్షిక సమావేశానికి పెద్ద సంఖ్య‌లో హాజ‌రైన పారిశ్రామిక వేత్త‌ల‌ను ఉద్దేశించి కెటిఆర్ ప్ర‌సంగిస్తూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడుగడుగునా అడ్డుపడుతుందని ఆరోపించారు. మేక్‌ ఇన్‌ ఇండియా… ఆత్మ నిర్భర్‌ భారత్‌. నినాదాలు బాగున్నాయి సరే… అమలు తీరు ఇదేనా అని కేంద్రాన్ని నిల‌దీశారు‌. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌…ఐటిఐఆర్ ఏదని ప్ర‌శ్నించారు… మేక్‌ ఇన్‌ ఇండియా అని చెబుతున్న కేంద్రం ఫార్మా రంగంలో చైనా నుంచే ఎక్కువగా దిగమతులు చేసుకుంటోందని గుర్తు చేశారు.. హైదరాబాద్‌ అతిపెద్ద ఫార్మా పార్క్‌ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. ప్రపంచానికే వ్యాక్సిన్ క్యాపిటల్‌గా ఉన్న హైదరాబాద్ టెస్టింగ్‌ ల్యాబ్‌ను ఎందుకు కేటాయించలేదని కూడా కేంద్రాన్ని సూటిగా అడిగారు కెటిఆర్. ప్రపంచంలోనే 35 శాతం వ్యాక్సిన్లు ఇక్కడే తయారవుతున్నాయని, టెస్టింగ్‌ కోసం మాత్రం 1200 కిలోమీటర్ల దూరంలోని ల్యాబ్‌కు వెళ్లాలా అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. ఐటీ, లైఫ్‌ సెన్సెస్‌, ఫార్మా, నిర్మాణ రంగాల్లో అగ్రస్థానం తెలంగాణ ఉంద‌ని అన్నారు. ఐటీ ఎగుమతులు రూ.1.40లక్షల కోట్లకు చేరాయని, స్టార్టప్‌లతో తెలంగాణ ఇన్నోవేషన్‌ హబ్‌గా మారుతోందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ అనేక చర్యలు తీసుకుంటున్నారని, స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ రంగానికి హైదరాబాద్‌ నిలయంగా ఉందన్నారు. తెలంగాణకు ఇచ్చిన ఏ హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని, అలాగే విభజన సమస్యలు పరిష్కరించలేదని కేటీఆర్‌ అన్నారు. గత ఆరేండ్లలో తెలంగాణకు ఎలాంటి ప్రత్యేక రాయితీలు ఇవ్వలేదని గుర్తు చేశారు. వరంగల్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారని, కోచ్‌ ఫ్యాక్టరీకి 60 ఎకరాలు అడిగితే 150 ఎకరాలు ఇచ్చామన్నారు. ఐటీఐఆర్‌ రద్దు చేసిన తెలంగాణకు న్యాయం చేశారని, తెలంగాణకు ఒక్క ఇండస్ట్రియల్‌ జోన్‌ ఇవ్వలేదని ఆరోపించారు.
బయ్యారం ఉక్కు ఊసేలేదన్నారు మంత్రి కేటీఆర్‌. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎవరిని అడగాలని ప్రశ్నించారు. బుల్లెట్‌ రైలు గుజరాత్‌కేనా.. హైదరాబాద్‌కు అర్హత లేదా? అని మంత్రి కేటీఆర్ బిజెపి కేంద్ర నాయ‌క‌త్వాన్ని నిల‌దీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement