Thursday, May 2, 2024

వ‌ర‌ద ముంపున‌కు శాశ్వ‌త ప‌రిష్కారం కోస‌మే స‌మ‌గ్ర నాలా అభివృద్ది : మంత్రి త‌ల‌సాని

ఎన్నో సంవత్సరాలుగా వరద ముంపున‌కు గురవుతున్న ప్రజల దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతోనే సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో గల తన కార్యాలయంలో ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రూ.45 కోట్ల వ్యయంతో చేపట్టిన బేగంపేట నాలా, రూ.10 కోట్ల వ్యయంతో పికెట్ నాలాపై చేపట్టిన బ్రిడ్జి విస్తరణ నిర్మాణ పనులపై సమీక్షించారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఎగువ నుండి వచ్చే వరదనీటితో బేగంపేట నాలా పరిధిలోని బ్రాహ్మణ వాడి, వడ్డెర బస్తీ, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాలు ముంపున‌కు గురై ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

నగరంలో ఉన్న అనేక నాలాల వద్ద ఇదే పరిస్థితులున్నాయని, గత పాలకులకు ఎంత మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అందులో భాగంగా బేగంపేట నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మాణంతో పాటు పూడిక తొలగించే పనులు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతోనే ఈ సంవత్సరం వరదముంపు సమస్య ప్రభావం తీవ్రత చాలా తగ్గిందని తెలిపారు. అదేవిధంగా పికెట్ నాలా నూతన బ్రిడ్జిని విస్తరించి నిర్మించడం వలన ముంపు సమస్య పరిష్కారం కానుందని చెప్పారు. పికెట్ నాలాపై ఇప్పటికే ఒక వైపు బ్రిడ్జి నిర్మాణం పూర్తయి రాకపోకలు కొనసాగుతున్నాయని, రెండోవైపు పనులు అక్టోబర్ 20వ తేదీ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రానున్నట్లు చెప్పారు. పనులు మరింత వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఎన్డీపీ ఎస్ఈ భాస్కర్ రెడ్డి, ఈఈ శ్రీనివాస్, డీఈ సునీల్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement