Thursday, April 25, 2024

గ్రేట‌ర్ పేద‌ల‌కు సొంతిల్లు.. నెర‌వేర‌నున్న క‌ల‌!

ప్రభ న్యూస్‌ బ్యూరో, గ్రేటర్‌ హైదరాబాద్‌ : షాన్‌ ఏ షహర్‌ హైదరాబాద్‌ మహానగరంలో అద్దె ఇంటి కోసమే సామాన్యులు విశ్వ ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థి తులు ఉంటాయి. అటువంటి పరిస్థి తుల నుంచి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే, సొంతింటిలో నివసించేందుకు అవసరమైన విధంగా డబుల్‌ ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి, ఉచితంగా అందజేస్తోంది. ఈ క్రమంలోనే అవకాశమున్న ప్రతి చోట డబుల్‌ నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతూ, త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి, లబ్ధిదారులకు అందిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్లుగా పంపిణీకి నోచుకోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లను పేదలకు అందించేందుకు చర్యలు చేపట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద నిర్మించిన ఇళ్ల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వ పక్షాన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ శుభవార్త చెప్పారు.

వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న 2336 జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందజేయడం ద్వారా వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో నిర్వహిం చిన సమీక్ష సమావేశంలో ఆయన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల పంపిణీకి సంబంధించిన సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌, సికింద్రాబాద్‌ ఆర్డీవో వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డివిజన్ల పరిధిలోని సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో హమాలీ బస్తీ, సనత్‌ సనత్‌ నగర్‌ నియోజకవర్గ పరిధిలోని గైదన్‌ బాగ్‌ కస్తుర్బానగర్‌, ఓల్డ్‌ పాటిగడ్డ, ఎన్బీటీ- నగర్‌ల్లో, కంటోన్మెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఎల్‌ఐసీ కాలనీలో, అంబర్‌పేట్‌ నియోజకవర్గ పరిధిలోని వీరన్నగుట్ట, చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని సర్వే నెం 82, 128, 83, ఉప్పుగూడ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ ప్రాంతాల్లో, గోషామహల్‌ నియోజకవర్గ పరిధిలోని పూల్‌ బాగ్‌-1, 2, మలక్‌పేట నియోజకవర్గ పరిధిలోని నందనవనం-2, ముంగనూర్‌ తదితర 16 ప్రాంతాల్లో 2006-2008 సంవత్సరాల మధ్యకాలంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద అప్పటి ప్రభుత్వం 10,178 ఇళ్లను నిర్మించడం జరిగిందని తెలిపారు.

వీటిలో 2336 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించే అంశం వివిధ కారణాలతో సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉందని మంత్రి వివరించారు. ఎంతో మంది నిరుపేదలు ఉండేందుకు సరైన ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇళ్లను నిరుపయోగంగా ఉంచడం వలన ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఇళ్ల కేటాయింపు కోసం లబ్ధిదారులు ఎంతోకాలం నుండి ఎదురుచూస్తున్నారని చెప్పారు. వీలైనంత త్వరగా పెండింగ్‌లో ఉన్న ఇళ్లను అర్హులకు కేటాయించడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం తమ ప్రభుత్వంపై ఉందన్నారు. త్వరలోనే ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించే విషయమై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement