Thursday, May 9, 2024

పోలీసుల కష్టడీకీ ఫాం హౌస్‌ నిందితులు.. దర్యాప్తులో చెప్పేవన్నీ కీలకమేనంటున్న పోలీసులు!!

ఆంధ్రప్రభ , హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంఎల్‌ఏల కొనుగోలు కేసులో నిందితులను పోలీసులు కష్టడీకి తీసుకున్నారు. హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలులో ఉన్న ముగ్గురు నిందితులను రెండు రోజుల పోలీస్‌ కష్టడీకి ఎసిబి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో గురువారం ఉదయం చంచల్‌గూడ జైలుకు చేరుకున్న మొయినాబాద్‌ పోలీసులు, నిందితులు రామచంద్ర భారతి, నందుకుమార్‌, సింహయాజి స్వామీలను తమ కష్టడీకి తీసుకున్నారు. అటునుంచి రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ముగ్గురు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించనుంది. ఈ సందర్భంగా నకిలీ ఆధార్‌, పాన్‌కార్డుల వ్యవహారంలో వంద కోట్లపై ఆరా తీయనున్నారు. ఈ సందర్బంగా వారు చెప్పేవన్నీ దర్యాప్తులో అత్యంత కీలకం కానున్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే సర్కారు సిట్‌ !!

కాగా టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏలకు ఎర కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ను ఏర్పాటు చేసింది. కేసును తప్పుదోవ పట్టించేందుకు బిజెపి స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పిటిషన్లు వేసి సిబిఐకి అప్పగించాలని కోరుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం .. ఈ కుట్రను పూర్తిగా బద్దలు సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ రాష్ట్ట్రాల్లో ఎంఎల్‌ఎలను కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వాలను పడగొట్టాలని లక్ష్యంతో బిజెపి తరఫున దూతలుగా వచ్చిన ముగ్గురు నిందితులను హైదరాబాద్‌ పోలీసులు సాక్షాధారాలతో పట్టుకోవడం తీవ్ర సంచలనం సృష్టించిన తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుండి మధ్యవర్తులుగా రావడం వారి వెనుక ‘ పెద్దలు ‘ ఉన్నట్లు అనుమానాల నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలకనిర్ణయం తీసుకున్నది. ఎంఎల్‌ఎలకు ఎర కేసు అత్యంత సున్నితమైనది కావడం, సంచలనాత్మకంగా మారడంతో ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉండనుందని, అనుభవజ్ఞులైన అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డిజిపి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొన్న సర్కారు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సివి ఆనంద్‌ నేతృత్వంలో ఆరు గురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది.

సివి ఆనంద్‌తో పాటు నేరాల దర్యాప్తులో అపార అనుభవం , నూతన సాంకేతికతను ఉపయోగించుకోవడంలో నైపుణ్యం ఉన్న
పలువురు ఉన్నతాధికారులను ఈ బృందంలో సభ్యులుగా నియమించింది. ఇందులో నల్లొండ ఎస్‌పి రెమా రాజేశ్వరి, సైబరాబాద్‌ డిసిపి కల్మేశ్వర్‌ సింగన్వర్‌ శంషాబాద్‌ డిసిపి జగదీశ్వర్‌ రెడ్డి, నారాయణపేట ఎస్‌పి వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్‌ ఎసిపి గంగాధర్‌, మొయినాబాద్‌ ఎస్‌హెచ్‌ఓ లక్ష్మిరెడ్డి ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. వీరు ఈ కేసును పూర్తి స్థాయిలో ఛేదించేందుకు ఇక ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తారని పోలీసు వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement