Wednesday, April 24, 2024

ఉమేష్ చంద్ర‌కు సీవీ ఆనంద్ నివాళులు

ఉమేష్ చంద్ర ఐపిఎస్ 56వ జయంతి సందర్భంగా ఎస్ ఆర్ నగర్ లోని ఆయన విగ్రహానికి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పూలమాల వేసి నివాళుల‌ర్పించారు. 1991 ఐపిఎస్ బ్యాచ్ కి చెందిన ఉమేష్ చంద్ర, 1999 సెప్టెంబర్ 4న నక్సలైట్ల చేతిలో హత్యకు గురయ్యారు. 1990వ దశకంలో నక్సల్స్ ఉద్యమాన్ని నియంత్రించడంలో ఉమేష్ చంద్ర చేసిన కృషిని ఈ సందర్భంగా కమీషనర్ గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, నిజాం కళాశాల, ఓ.యూలో చదువుతున్న రోజుల్లో తన కన్నా రెండు సంవత్సరాలు సీనియర్ అయిన ఉమేష్ చంద్రతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యే రోజుల్లో వారి మార్గదర్శకత్వం తీసుకున్నట్లు ఈ సందర్భంగా సీపీ ఆనంద్‌ తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఉమేష్ చంద్ర వంటి గొప్ప పోలీస్ అధికారిని కోల్పోవడం వారి తల్లిదండ్రులతో పాటు పోలీసుశాఖకు కూడా తీరని లోటని విచారణ వ్యక్తం చేశారు. అనంతరం ఉమేష్ చంద్ర తల్లిదండ్రులతో మాట్లాడిన సీపీ, ఆయన పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యులు, పంజాగుట్ట ఏసీపీ, ఎస్‌హెచ్‌ఓ ఎస్‌ఆర్‌ నగర్‌, ఇతర అధికారులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement