Sunday, June 9, 2024

Hyderabad – బోనస్ పేరుతో కాంగ్రెస్​ మోసం – బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బీజేపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వరి పంటకు బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకే రూ.500 బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో సన్న వరి తక్కువ మంది రైతులు వేస్తారన్నారు. యాసంగిలో 90 శాతం దొడ్డు రకం ధాన్యమే రైతులు పండిస్తారన్నారు. రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. ఇప్పుడేమో ఆగస్టు 15 లోగా చేస్తామని అంటున్నారని సీరియస్ అయ్యారు.

కేంద్రం సిద్ధం..

- Advertisement -

డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. రాష్ట్రంలో 80 శాతం దొడ్డు వడ్లనే పండిస్తారన్నారు. చాలా తక్కువ మంది రైతులే సన్న వడ్లు పండిస్తారని తెలిపారు. దొడ్డు వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని క్లారిటీ ఇచ్చారు. దొడ్డు వడ్లను కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం బోనస్ పేరుతో రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అన్ని రకాలుగా రాష్ట్ర రైతులకు అండగా ఉందన్నారు. రబీ కింద 75 లక్షల ధాన్యం సేకరించాలని ఒప్పందం కుదుర్చుకుందని గుర్తు చేశారు.

రెండు పార్టీలది ఒకే తీరు..
గతంలో బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని సీరియస్ అయ్యారు. ధాన్యం తడిచి మొలకెత్తుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి వారాలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు గాస్తున్నారన్నారు. నిన్న 75 వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని.. ఇలాగే కొనసాగితే ధాన్యం కొనేందుకు మరో 2 నెలలు సమయం పడుతుందన్నారు. వర్షాలు పడి ధాన్యం మొలకలు వస్తుంటే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement