Wednesday, May 15, 2024

Honey Trap – సీనియ‌ర్ సిటిజ‌న్ కు వ‌ల‌పు వ‌ల … బంగారు గొలుసుల‌తో జంప్

హైద‌రాబాద్ – విలాసాలకు అలవాటు పడ్డ ఇద్దరు కిలాడీ లేడీలు ఓ వృద్ధుడిపై వలపు వల విసిరారు. ఫోన్‌లో తియ్యగా మాట్లాడి అతడి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత అతన్ని మాటల్లో పెట్టి మెడలోని బంగారు గొలుసులు లాక్కుని ఉడాయించారు. దీంతో మోసపోయిన వృద్ధుడు పోలీసులను ఆశ్రయిచాడు. నాగోలు ఠాణా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై మధు తెలిపిన కథనం ప్రకారం.. మేడ్చల్‌కు చెందిన పసుపులేటి శిరీష (36), ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన ఉన్నీసా బేగం అలియాస్‌ సమీనా (40) స్థానికంగా బ్యుటీషీయన్లుగా పని చేస్తున్నారు. చెడు వ్యసనాలను అలవాటు పడిన వీరిద్దరూ సులువుగా సంపాదించేందుకు పథకం వేశారు. ఈ క్రమంలో నాగోలు మత్తుగూడ సమీపంలోని ఓ హోటల్‌లో ఇటీవల ఓ వృద్ధుడిని పరిచయం చేసుకున్నారు. మాటల్లో పెట్టి అతని ఫోన్‌ నంబరు కూడా తీసుకున్నారు. తరచూ వృద్ధుడికి ఫోన్‌ చేసి మాట్లాడసాగారు. ఈ క్రమంలో ఆదివారం వారు హోటల్‌ వద్దకు వచ్చి అతడికి ఫోను చేసి, హోటల్‌ వద్దకు రావాలని కోరారు. అయితే తమ ఇంట్లో ఎవరూ లేరని, తానూ రాలేనని వృద్ధుడు సమాధారం చెప్పాడు.

వారినే తన ఇంటికి రావాలని ఆహ్వానించాడు. ఇదే అదనుగా అతడి ఇంట్లోకి చేరిన ఆ ఇద్దరూ వృద్ధుడిని మాటల్లో పెట్టారు. వృద్ధుడి మెడలో రెండు బంగారు గొలుసులు ఉండటం గమనించారు. అదును చూసి అతని మెడలోని రెండు బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యారు. మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బంగారు గొలుసులు స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు. గతంలోనూ హయత్‌నగర్‌ ఠాణా పరిధిలో ఉన్నీసాబేగం ఇదే తరహాలో మరో వ్యక్తితో మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement