Wednesday, May 15, 2024

Exclusive | బీజేపీకి మృత్యుంజయం గుడ్ బై.. కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపిన పంతులు!

కరీంనగర్ (ప్ర‌భ న్యూస్‌): సీనియర్ రాజకీయవేత్త, క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల (శుక్ర‌వారం) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి పంపించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, బిజెపి అధికార పార్టీ మధ్య సంబంధాలు నిశితంగా పరిశీలించిన మీదట, ఇకపై పార్టీలో కొనసాగలేనని, అందుక‌ని బిజెపి నుండి వైదొలుగుతున్నట్టు పంతులు త‌న రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

నాటి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రోద్బలంతో 2019లో మృత్యుంజయం బిజెపిలో చేరారు. పార్టీలో ఎలాంటి హోదా లభించకున్నప్పటికీ వివిధ ఎన్నికల్లో పార్టీ ఆదేశం మేరకు అభ్యర్థుల విజయం కోసం ఆయన కృషి చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా తిరువన్నామలై నియోజకవర్గ ఇన్చార్జిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఆయన పనిచేశారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కొన్ని డివిజన్లకు ఆయన ఇంచార్జ్ గా వ్యవహరించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఆయన పనిచేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా కొన్ని మండలాల ఇన్చార్జిగా ఆయన విధులు నిర్వహించారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా జిల్లాలో పార్టీని పటిష్ట పరిచిన మృత్యుంజయం ఆ పార్టీకి చెందిన జిల్లా నేతలతో పొత్తు పొసగక, బిజెపిలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement