Thursday, May 2, 2024

Flag Day – పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి – .. సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

సిరిసిల్ల, అక్టోబర్ 26 (ప్రభన్యూస్) : విధి నిర్వహణలో కర్తవ్యమే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసి అమరులైన పోలీసులను ఈ సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం ‘ఫ్లాగ్ డే’ పురస్కరించుకొని సిరిసిల్ల పద్మనాయక ఫంక్షన్ హాల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటి వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిధిగా హాజరై పోలీస్ అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అందరితో పాటు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడుతూ సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో బలైన అమర పోలీసు వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సమాజ రక్షణ వీరులు నిరంతర ధీరులు, ప్రాణాలను కూడా లెక్కచేయని విధి నిర్వహణ రక్షకులు, ప్రకృతి విలయతాండవం చేస్తే అభయమిచ్చి కాపాడే ఆప్తులు, నిద్రించే సమాజానికి నిద్రపోని కాపలాగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. రెగ్యులర్ పోలీసింగ్ తో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు, రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది తలసేమియా, సికిల్ సెల్ అనీమియా అలాగే డెంగ్యూ వ్యాధిగ్రస్తులకు రక్తం చాలా అవసరం అని వారికి సహాయం కోసం అమర వీరుల స్మారకార్ధం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 600 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది, జిల్లాలోని యువకులు, బీఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారన్నారు.
సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించారన్నారు. రక్తదాన శిబిరంలో రక్తదానం చేసేందుకు పెద్ద సంఖ్యలో యువకులు ముందుకు వచ్చి ఉత్సాహంగా పాల్గొనడం అభినందించదగన విషయమని ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచారి, రవికుమార్, సి.ఐ లు ఉపేందర్, సధన్ కుమార్, శశిధర్ రెడ్డి, కరుణాకర్, కృష్ణకుమార్, కిరణ్ కుమార్, అనిల్ కుమార్, ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, బీఎస్ఎఫ్ సిబ్బంది, యువకులు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అద్యక్షులు గుడ్ల రవి, వరంగల్ అధ్యక్షులు శ్రీనివాస్, కరీంనగర్ అధ్యక్షులు కేశవరెడ్డి, మంచిర్యాల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement