Thursday, May 2, 2024

Big Story | మొదలైన ఎలక్షన్‌ హీట్.. తెలంగాణలో ఎన్నికల వాతావరణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అక్టోబర్‌లో షెడ్యూల్‌ జారీ చేసి నవంబర్‌లో అసెంబ్లి ఎన్నికల దిశగా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. అక్టోబర్‌ 14న తుది ఓటర్‌ జాబితా ఫైనల్‌ కానున్న నేపథ్యంలో ఆ తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్‌ నోటిఫికేషన్‌కు అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ నెల 30తో బదలీల ప్రక్రియ కూడా ముగియనుండటంతో ఇక అన్ని అడ్డంకులు తొలగిపోనున్నాయి. గత ఎన్నికల సమయంలో అక్టోబర్‌ 6న షెడ్యూల్‌ జారీ చేసి డిసెంబర్‌ 7న ఎన్నికలను నిర్వహించారు. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ఏడాది కావడం, గడువు దగ్గరపడటంతో ప్రజాక్షేత్రంలోకి చేరుతున్నాయి.

తమతమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకొని ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు. పార్టీలన్నీ ఏదోఒక కార్యక్రమం పేరుతో క్షేత్రస్థాయికి చేరుతున్నాయి.దీంతో రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది. అధికార, విపక్ష పార్టీలు ఒకరిని మించి మరొకరు వ్యూహాత్మకంగా ఎన్నికలకు ఇసద్దమవుతున్నారు. ప్రజల మద్దతు పొందేందుకు పార్టీలన్నీ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. తీరా ఎన్నికలు సమీపించినతర్వాత ప్రజల్లోకి వెళితే కలిసిరావడంలేదని భావిస్తున్న విపక్షాలు ఇప్పటికే ప్రజల్లోకి చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

- Advertisement -

ప్రజల ఆదరణ పొందేందుకు వీలుగా ప్రజా సమస్యలను భుజాలపై వేసుకొని అధికార పార్టీని ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ అధిష్టానం సూచనల మేరకు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళుతోంది. స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లు, కాంగ్రెస్‌ పార్టీ హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లింది. బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా బీఎస్పీ నేత ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, రాజన్న రాజ్యం పేరుతో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిళ, పంజాబ్‌ ఎన్నికల్లో విజయంతో ఊపుమీదున్న ఆమ్‌ ఆద్మీ పార్టీలు కూడా తెలంగాణలో ఉనికిని చూపేందుకు ప్రజల్లోకి వెళుతున్నారు.

ప్రజల్లోకి పార్టీలు…

ఈ ఏడాది పూర్తిగా కొత్త ఈవీఎంలను వినియోగించనుండగా తుది ఓటర్ల జాబితాతో పూర్తిస్థాయికి కసరత్తు ముగియనుంది. ఇప్పటికే ఈవీఎం మిషన్ల పరిశీలన పూర్తి చేశారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు తమ ప్రచార ఆర్బాటాలను కూడా ఇప్పటికే ముమ్మరం చేసిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. సీఎం కేసీఆర్‌ వరుసగా అన్ని జిల్లాల్లో పర్యటించి కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ పర్యటనల్లోనే బహిరంగ సభలను నిర్వహించి ప్రజలనుద్దేశించి ప్రసంగించి ప్రచారంలో ముంతంజలో ఉన్నారు.

అన్ని రాజకీయ పార్టీలు ప్రజాక్షేత్రంలోకి చేరుకొని వరుస సభలు, సమావేశాలు, ఏదో ఒక కార్యక్రమం పేరుతో ప్రజలమధ్యే ఉంటున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడొస్తుంది…? పోలింగ్‌ ఎప్పుడు..? అనేది చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్‌లో షెడ్యూల్‌ రానుందని అంచనా వేస్తున్న పార్టీలు నియోజకవర్గాల వారీగా సర్వేలు, అభ్యర్ధుల వేట, ఆర్ధిక, ఇతర బలాలపై దృష్టిసారించాయి. అక్టోబర్‌ 4న ఫైనల్‌ ఓటర్‌ లిస్ట్‌ వెల్లడించిన తరువాయి ఈసీ షెడ్యూల్‌ జారీ చేస్తుందని పార్టీలు భావిస్తున్నాయి.

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ మార్చి 15 తర్వాత వెల్లడయ్యే అవకాశాలున్నాయి. గతంలో 2018 సెప్టెంబర్‌ 6న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయగా అక్టోబర్‌ 6న ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. నవంబర్‌ 12న నోటిఫికేషన్‌, డిసెంబర్‌ 7న పోలింగ్‌ జరిగి 11న ఓట్ల లెక్కింపు చేపట్టారు. అయితే ఈసారి తెలంగాణతోపాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించాలని ఈసీ ప్లాన్‌ చేస్తోంది.

ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోండగా, రాజకీయ పార్టీలు తమవైన శైలిలో ప్రజల్లోకి దూసుకెళుతున్నాయి. సీఎం కేసీఆర్‌ వరుస పర్యటనలు చేస్తోండగా ప్రతీ జిలకలాలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని బిజీ అయ్యారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ కూడా స్పీడ్‌ పెంచింది. రేవంత్‌రెడ్డి. భట్టి విక్రమార్కలు పాదయాత్రల పేఉరుతో ప్రజల్లోకి వెళ్లి అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో జవసత్వాలు వచ్చాయి. వసలు కూడా పెరగడంతో ఈ పార్టీ నేతలు ఊపుమీదున్నారు. కాగా కర్ణాటక ఫలితాల తర్వాత ఢీలా పడిన బీజీపి కేంద్ర నాయకుల రాకతోపాటు నూతన సారథి బాధ్యతలతో కొంత స్పీడ్‌ పెంచింది. వచ్చే ఏడాది జనవరి 16తో అసెంబ్లిd గడువు ముగుస్తున్న నేపథ్యంతోపాటు వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్‌ విజయం సాధించాలని అధికార బీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

గతంలో ఇలా…

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో మరింత వేగం పెరగనుంది. పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటుతోపాటు, ఎలక్ట్రానిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌, వీవీప్యాట్లపై ఎక్కడికక్కడ పరిశీలన తుది దశకు చేరింది. 2019 ఎన్నికల్లో నోటిఫికేషన్‌కు, ఎన్నికలకు మధ్య 24 రోజుల గడువు ఉండగా 2014 అసెంబ్లిd ఎన్నికల సమయంలో ఎన్నికలకు 29 రోజుల సమయం పట్టింది. ఏప్రిల్‌ 2న నోటిఫికేషన్‌ జారీ చేసి అదేనెల 30న పోలింగ్‌ నిర్వహించారు. మరోవైపు మరోసారి ఓటర్ల జాబితా వార్షిక ప్రత్యేక సవరణ ప్రారంభమైంది. ఓటర్ల జాబితా సవరణ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్‌ ప్రకటించింది. 2024 జనవరి 1నాటికి 18ఏళ్లు నిండిన పౌరులందరికీ ఓటర్లుగా నమోదు చేసుకునేలా ఈసీ చర్యలు ఆరంభించింది. ఈ కార్యక్రమం ఆగష్టు 1న ముసాయిదా జాబితాతో ప్రారంభించనున్నారు. ఆగష్టు 21నుంచి సెప్టెంబర్‌ 19 వరకు ఓటర్‌ లిస్టులో పేర్ల చేర్పులకు, మార్పులకు అవకాశం కల్పించారు. ఆగష్టు 1న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసి ఈ జాబితాలో ఓటర్లు తమ పేరు ఉందో లేదో చూసుకుని అభ్యంతరాలు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. పేర్లు లేకపోయినా గల్లంతైనా మళ్లిd ఫారం-6 సమర్పించి ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చని ఈసి పిలుపునిచ్చింది. సెప్టెంబర్‌ 18నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలిస్తారు. అక్టోబర్‌ 4న తుది ఓటర్‌ జాబితాను విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement