Monday, April 29, 2024

21 నుంచి హైదరాబాద్ లో మలి విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణి – కేటీఆర్

హైదరాబాద్ – డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగితే పూర్తిస్థాయి బాధ్యత అధికారులదే అని మంత్రి కేటీఆర్ అన్నారు. తప్పు చేసిన అధికారులను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసి వేసే స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. . హైదరాబాద్‌ నగరంలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మహబూద్‌ అలీ, మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న హైదరాబాద్‌ రెండో దశలో దాదాపు 13,300 ఇండ్లను అందించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు

అత్యంత పారదర్శకంగా అర్హులైన పేదలకు మాత్రమే అందిస్తున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదని అన్నారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికను పూర్తిస్థాయి బాధ్యత అధికారులకే అప్పగించిందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరి వివరాలతో కంప్యూటర్ ఆధారిత డ్రా తీస్తున్నామని, లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామన్నారు. ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మీడియా ముందు నిర్వహిస్తున్నామన్నారు..

ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసారు. ఎక్కడా తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే అన్నారు. ఇండ్ల ఎంపికలో ఏదైనా ఇబ్బందులు జరిగితే వాటిని ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

నగరంలో గృహలక్ష్మి పథకం కూడా త్వరలో ప్రారంభమవుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో గృహలక్ష్మి కార్యక్రమానికి కొన్ని మార్పు చేర్పులు చేయాలని మంత్రులు ముఖ్యమంత్రిని కోరామన్నారు. వారు సూచించిన మార్పులకు ముఖ్యమంత్రి సూచనప్రాయంగా అంగీకరించారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో నోటరీ ప్రాపర్టీల అంశంలోనూ త్వరలో పూర్తి మార్గదర్శకాలు వస్తాయన్నారు. 58, 59 జీవోల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ రకాల కార్యక్రమాల ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం, పట్టాల రెగ్యులరైజేషన్, నోటరీ ఆస్తుల అంశం వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి నియోజకవర్గానికి కనీసం 15 నుంచి 20వేల మందికి లబ్ధి కలిగిందన్నారు. మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న కబ్జాలను తొలగించి, వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని,. ఈ కార్యక్రమాన్ని కూడా వేగంగా ముందుకు తీసుకువెళ్తామని కేటీఆర్ అన్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement