Monday, April 29, 2024

MBNR: కాంగ్రెస్ కు 90నుంచి 100సీట్లు రావడం ఖాయం .. మల్లు రవి

గద్వాల (ప్రతినిధి) నవంబర్ 23 (ప్రభ న్యూస్) : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 90నుంచి 100 సీట్లు రావడం ఖాయమని ఆ పార్టీ మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్లు రవి విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో రాక్షసపాలన పోయి మంచిపాలన వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడని, స్వయంగా సీఎం ఒప్పుకొని రేవంత్ రెడ్డి వస్తే ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డిపై మాట్లాడటం కాంగ్రెస్ గెలుపునకు నాంది అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావ అని, కాంగ్రెస్ పార్టీలోకి దూకి ప్రాణాలు రక్షించుకొనే పనిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పడ్డారని జ్యోషం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి పోలీసు యంత్రాంగం ప్రైవేటు సైన్యంగా పనిచేస్తుందని ఆయన పోలీసు శాఖను విమర్శించారు.

ఆనాటి రజాకార్ల వ్యవస్థను గుర్తుచేసే విధంగా బీఆర్ఎస్ పాలన ఉందన్నారు. బ్రిటిష్ పరిపాలన పోవడానికి మనవాళ్ళు ఎన్ని పోరాటాలు చేసారో అదే ధోరణిలో నేడు తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీని తప్పించడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, దీనికి అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రజలందరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉన్నారని తెలిపారు. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నరకాసుర వధ అవుతుందని, ఆ రోజే గద్వాల కాంగ్రెస్ అభ్యర్థి సరిత సమక్షంలో భారీగా దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత ఎంఎసి మైక్రో బయోలజీ చదువుకోవడంతో చిన్న వస్తువులను కూడా పరిశోధన చేసే పరిజ్ఞానం ఉందని, మీ నియోజకవర్గంలో చిన్న సమస్యలను కూడా పరిష్కారం చేయడంలో సామర్ధ్యం కలిగిన నాయకురాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇరిగేషన్ అభివృద్ధి జరిగిందని నాగార్జున్ సాగర్, శ్రీశైలం, జూరాల, నెట్టంపాడు, ర్యాలంపాడు, ద్యాగదొడ్డి, నాగర్ దొడ్డి, తాటికుంట, తూముకుంట రిజర్వాయర్ ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేపట్టిందన్నారు. 26వ తేదీన ప్రియాంక గాంధీ భారీ బహిరంగ సభను గద్వాలలో విజయవంతం చేయాలని మల్లు రవి కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement