Friday, May 3, 2024

జాతీయ స్థాయి సదస్సుకు చీమలజరి సర్పంచ్ నరసింహ రెడ్డికి ఆహ్వానం

వికారాబాద్ ( ప్రభ న్యూస్) :జాతీయ స్థాయి వర్క్ షాప్ కు చీమల్ దరి సర్పంచ్ నాసన్ పల్లి నరసింహారెడ్డి కి ఆహ్వానం వ‌చ్చింది. ఈనెల 21 నుండి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లోని శ్రీనగర్ పట్టణంలో పంచాయతీ రాజ్ లో సుపరిపాలన అనే అంశంపై నిర్వహిస్తున్న జాతీయ స్థాయి వర్క్ షాప్ నకు హాజరు కావలసిందిగా చీమల్ దరి సర్పంచ్ నాసన్ పల్లి నరసింహారెడ్డి కి ఆహ్వానం అందింది.

ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కాలిద్ మజీద్ నుండి సర్పంచ్ నరసింహారెడ్డికి ఆహ్వానం చేరింది. ఇదే సంవత్సరం ఏప్రిల్ 19న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన జాతీయ స్థాయి సదస్సులో కేంద్ర పట్టణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖల మంత్రివర్యులచే సుపరిపాలన విభాగంలో చీమల్ దరి గ్రామం జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లో నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి వర్క్ షాప్ లో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి పాల్గొంటున్న పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అధికారులు వివిధ జాతీయ స్థాయి అవార్డులు అందుకున్న స్థానిక సంస్థల ప్రతినిధులతో జరిగే సదస్సులో నరసింహారెడ్డి ప్రసంగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement