Monday, May 6, 2024

Brutal Murder – రెండు రోజుల‌లో కుమార్తె వివాహం – లండ‌న్ లో తండ్రి దారుణ హ‌త్య‌..

లండన్‌లో హైదరాబాద్‌ వాసి హత్యకు గురయ్యాడు. ఉపాధి కోసం లండన్‌కు వెళ్లిన రైసుద్దీన్‌ను కొంత మంది దుండగులు హత్య చేశారు.. అత‌నితో పాటు అత‌డి స్నేహితుడిని సైతం చంపివేశారు.. వివ‌రాల‌లోకి వెళితే హైదరాబాద్ కు చెందిన ఖాజా రయీసుద్దీన్ 2011లో ఉపాధి కోసం లండన్ వెళ్లాడు. అప్పటి నుంచి వెస్ట్ యార్క్ షైర్ లోని లీడ్స్ లో నివసిస్తున్నాడు. ఈ నెల 5న హైదరాబాద్ లో కూతురు వివాహం జరగాల్సి ఉంది. దీంతో ఇండియాకు తిరిగి వచ్చేందుకు రయీసుద్దీన్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన స్నేహితుడు ఆఫ్ఘనిస్థాన్ దేశస్తుడితో కలిసి బయటకు వెళ్లాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళుతుండగా ఉగాండా జాతీయుడిగా అనుమానిస్తున్న దుండగుడు దాడి చేశాడు.

కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో స్నేహితులిద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బు, విలువైన వస్తువులతో దుండగుడు పారిపోయాడు. తీవ్ర రక్తస్రావం కారణంగా రయీసుద్దీన్ తో పాటు అతడి స్నేహితుడు కూడా చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, రయీసుద్దీన్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్ కు చేర్చేలా చూడాలని బాధిత కుటుంబం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement