Wednesday, May 1, 2024

Bhadrachalam – రెండు నెల‌ల మీ పాల‌న‌లో రూ. 14వేల కోట్లు అప్పులా – రేవంత్ ను నిల‌దీసిన హ‌రీష్ రావు

భ‌ద్రాచ‌లం – బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులపై మాట్లాడుతోన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలల కాకముందే రూ.14 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియ‌ర్ నేత హ‌రీష్ రావు. భద్రాచలంలో నేడు బీఆర్ఎస్ కార్యకర్తలతో హరీష్ రావు పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందని రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లి రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారని అన్నారు. కానీ మన్యాన్ని విష జ్వరాల నుంచి కాపాడింది బీఆర్ఎస్ అని గుర్తు చేశారు.

రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధమేనని ఆరోపించారు. అసెంబ్లీలోనూ అబద్దాలే, ఆదిలాబాద్ లోనూ అబద్దాలేనని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు నాలుగు మెడికల్ కాలేజీలు ఇచ్చింది బీఆర్ఎస్సే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు సున్నా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు తిట్ల పురాణం తప్ప చేసిందేమీ లేదన్నారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు అని నిలదీశారు. రాష్ట్రంలో తిరోగమనం మొదలైందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయ్యాయని చెప్పారు. అదానీతో కాంగ్రెస్ పార్టీ ఒప్పందాలు చేసుకున్నదని ఆరోపించారు.

దాసోజ్ శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా తమ ప్రభుత్వం నామినేట్ చేస్తే గవర్నర్ తిరస్కరించారని ఆక్షేపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించగానే ఆమోదించారు. ఎవరు ఎవరు కుమ్మక్కయ్యారని ప్రశ్నించారు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదని బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బీజేపీని ఢీకొట్టగలదని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ కీలక నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ . ర‌ఘునంద‌న్ , ద‌ర్మ‌పురి అర‌వింద్ , సోయం బాపూరావు లను బీఆర్ఎస్ పార్టీ ఓడించిందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సైతం హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత దేశ ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకపోతే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యేవారే కాదని.. పీసీసీ చీఫ్ కాకపోతే ఆయన సీఎం అయ్యేవారే కాదన్నారు. ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డికి కేసీఆర్ పెట్టిన భిక్ష అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీనియర్ సిటిజన్లకు ప్రకటించిన పెన్షన్ రూ.4000 కాదు కదా.. ఇప్పటి వరకూ ఇచ్చిన రూ.2000 పెన్షన్ కూడా ఇవ్వలేదని హరీశ్ రావు గుర్తు చేశారు. రోజూ కరంట్ ఆరు సార్లు పోతున్నదని ప్రజలు చెబుతున్నారని అన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు అన్నీ ఇన్నీ కాదని, ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్ల మీదకు ఈడ్చారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణ మాఫీ హామీ సంగతేమిటని హరీశ్ రావు ప్రశ్నించారు. తిట్ల పురాణం తప్ప మీరు చేసిందేమిటని నిలదీశారు. రైతులకు రుణ మాఫీ హామీ ఏమైందన్నారు. ఈ నెల నుంచే రూ.4000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణవాదం ఢిల్లీలో వినిపించాలంటే పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను మెజార్టీ సీట్లలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement