Monday, April 29, 2024

మంచంపట్టిన తెలంగాణ.. డెంగీ, మలేరియా బారిన జనం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులకు జ్వర బాధితులు క్యూ కడుతున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. వర్షాలు దండిగా కురుస్తుండడం, తెరిపి ఇచ్చినపుడు వాతావరణంలో ఉష్ణోగ్రతలు హెచ్చుగానే ఉండడంతో నీరు నిల్వ ఉన్న ప్రదేశాలు ఈగలు, దోమల సంతతి గణనీయంగా వృద్ధి చెందుతోంది. ఫలితంగా దోమకాటు కారణంగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరాలకు తోడు దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, డయేరియా తదితర అనారోగ్య సమస్యలు కూడా ప్రజలను సతమతం చేస్తున్నాయి. నెలన్నర రోజులుగా రాష్ట్రంలో జ్వరాలు, డయేరియా, దగ్గు, జలుబుతో జనం మంచం పడుతున్నారు. జ్వర తీవ్రత అధికంగా ఉంటుండడంతో చాలా మంది ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకాలంలో, సరైన రీతిలో వైద్యం అందించడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ జ్వరాలను వైరల్‌ ఫీవర్స్‌ గా అధికారులు చెబుతున్నా మలేరియా, టైఫాయిడ్‌ లక్షణాలు రోగుల్లో బహిర్గతం అవుతున్నాయని ల్యాబ్‌ల నిర్వహకులు చెబుతున్నారు. దోమకాటు కారణంగా డెంగీ జ్వరాల బారిన పడుతున్న ప్రజల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఒక్క ములుగు జిల్లాల్లోనే దాదాపు 69 డెంగీ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు డెంగీ, మలేరియాతో మంచం పడుతున్నారు.

లోపించిన పారిశుధ్యం.. మూలాన పడ్డ ఫాగింగ్‌ మిషన్లు

ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం లోపించడంతోపాటు నీరు నిలిచిన చోట్ల దోమలు వృద్దిచెందుతున్నాయి. మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు పారిశుధ్య చర్యలు కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చాలా చోట్ల ఫాగింగ్‌ మిషన్లు మూలకు పడ్డాయి. అయితే దోమల నివారణకు ఫాగింగ్‌, దోమల మందులను పిచికారి చేయడం, బ్లిచింగ్‌ పౌడర్‌ చల్లడం వంటి పారిశుధ్య చర్యలు లోపించాయి. ఫలితంగా మురికి కాలువలు, నీరు నిలిచిన గుంతల్లో ఈగలు, దోమల తీవ్రంగా ప్రబలుతున్నాయి. డ్రైనేజీ కాలువలు చెత్తా చెదారంతో నెలల తరబడి నిండిపోయినప్పటికీ శుభ్రం చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో మరింతగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement