Wednesday, April 24, 2024

చీకట్లు నింపిన దీపావళి.. ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు

దేశవ్యాప్తంగా దీపావళి వేడుకులు ఘనంగా జరిగాయి. అయితే, హైదరాబాద్ లో జరిగిన వేడుకల్లో పలు చోట్ల విషాదం నింపింది. దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. టపాసుల మోతతో సందడి సందడిగా ఉంటుంది. చిన్నా, పెద్ద ఇలా ఇంటిల్లిపాది కలిసి పటాకులు కాల్చుతూ దీపావళిని సెలబ్రేట్‌ చేసుకుంటారు. అయితే, టపాసులు కాల్చే సమయంలో నిర్లక్ష్యంగా ఉండడంతో అపశృతి జరుగుతోంది. బాణాసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆస్పత్రి పాలవుతున్నారు.

హైదరాబాద్‌ నగరంలో జరిగిన దీపావళి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. పలుచోట్ల పటాకులు కాల్చేటప్పుడు జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో బాధితులు కంటి సమస్యలతో బాధపడుతూ మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారని సమాచారం. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు దాదాపు 50 కేసులు నమోదు అయినట్టుగా తెలుస్తోంది. 32 మంది ఆస్పత్రికి రాగా.. ఇందులో స్వల్పంగా గాయాలైన 25 మందికి పైగా చికిత్స అందించి తిరిగి ఇంటికి పంపించామని వైద్యులు చెబుతున్నారు. ఇదే సమయంలో తీవ్రంగా గాయపడినవారిని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు చిన్నారులకు సర్జరీ చేశామని, ప్రస్తుతం వారిని అబ్జర్వేషన్‌లో ఉంచామని వైద్యులు తెలిపారు. పటాకులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

ఇది కూడా చదవండి: vizag: టోల్ ప్లాజా సిబ్బందిపై వైసీపీ నేతల దాడి

Advertisement

తాజా వార్తలు

Advertisement