Wednesday, May 8, 2024

TS: కేసీఆర్ మరో మానవీయ కోణ పథకమే “సీఎం బ్రేక్ ఫాస్ట్”.. మంత్రి వేముల

వేల్పూర్, అక్టోబర్ 6(ప్రభ న్యూస్) : సీఎం కేసీఆర్ మదిలోంచి పుట్టిన మరో మానవీయ కోణ పథకమే “సీఎం బ్రేక్ ఫాస్ట్” అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో “సీఎం బ్రేక్ ఫాస్ట్” కార్యక్రమాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థినీ, విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ వడ్డించారు. వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహార భోజనం అందుతున్నదా అని ఆరా తీశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…కేసీఆర్ జనరంజక పాలనలో భాగంగా ఎన్నో మానవీయ కోణంలో పథకాలు ప్రవేశ పెట్టారన్నారు.

పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్, తర్వాత అంగన్ వాడిలో ఎగ్స్, తర్వాత గురుకుల పాఠశాలలో మంచి విద్య, సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు. ఒకప్పుడు 200 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటే కేసీఆర్ 1000 పైగా రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పారన్నారు. పేదవారు కూడా ప్రపంచంతో పోటీ పడేలా మంచి విద్యను అభ్యసించాలని కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఇంగ్లీష్ మీడియంలో బోధన ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు పౌష్ఠిక ఆహారం అందించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అట్లాగే మెరుగైన విద్య కోసం మన ఊరు మన బడి ద్వారా పాఠశాలలు బాగు చేస్కుని డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశామన్నారు. మధ్యాహ్న భోజన పథకం లాగే విద్యార్థులకు మంచి పోషకాహారం కోసం సీఎం బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేశారని, ఇందుకోసం ప్రభుత్వం 500 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. రోజుకు ఒక్కవెరైటీ ఇడ్లీ, పూరి, కిచిడి మెనూ ప్రకారం 27,147 పాఠశాలలోని 23 లక్షల మంది విద్యార్థులకు రోజు అందించనున్నట్లు తెలిపారు.


పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ చాలా కేర్ తీసుకొని పెట్టాలనీ, పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబర్చాలని, శుచి శుభ్రత తప్పనిసరిగా పాటించాలని పాఠశాల ఉపాద్యాయులకు, నిర్వాహకులకు సూచించారు. పిల్లలందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సైంటిస్టులు కావాలని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశీర్వదించారు. తాను కూడా ఇదే స్కూల్లో విద్యను అభ్యసించానని, సీఎం కేసీఆర్ దయతో మంత్రి హోదాలో ఇక్కడే “సీఎం బ్రేక్ ఫాస్ట్” కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. వేల్పూర్ స్కూల్లో 640 మంది విద్యార్థులకు, జిల్లా వ్యాప్తంగా 1.46 లక్షల మంది విద్యార్థినీ, విద్యార్థులకు “సీఎం బ్రేక్ ఫాస్ట్” అందనుందన్నారు. రెడ్ క్రాస్ అధ్వర్యంలో విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వినోద్, జిల్లా విద్యాధికారి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, స్కూల్ హెచ్.ఎం, టీచర్లు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement