Friday, May 3, 2024

Hyderabadలోమరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు..స్పోర్ట్స్ కారుతో రెండు బైక్‌లను ఢీ

హైద‌రాబాద్‌లోని వరుసగా జరుగుతున్న హిట్‌ అండ్ రన్ ప్రమాదాలతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలతో ఢీకొట్టి ఆపై ఆపకుండా పరారవుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా అనేక మంది అమాయక ప్రజలు బలవుతున్న పరిస్థితి. కొద్ది రోజుల క్రితం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద బైకును కారు ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఇంకా మరువక ముందే మరో ఘటన నగరంలో కలకలం రేగింది.

బుధ‌వారం రాత్రి జూబ్లీహిల్స్‌లో ఓ స్పోర్ట్స్ కార్ బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు.. రెండు బైక్‌లను ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం కారుతో యువకులు పరారయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్పోర్ట్స్ కారు గుంటూరుకు చెందిన వారిదిగా గుర్తించారు. బిక్కి అశోక్ పేరు మీద స్పోర్ట్స్ కార్ రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బిక్కి అశోక్ గుంటూరు కాటమురు ప్రాంతానికి చెందిన వ్యక్తి. దీంతో నిందితుల కోసం జూబ్లీహిల్స్ పోలీసుల బృందం గుంటూరుకు బయలుదేరింది. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మాదాపూర్‌లోని మేడికోవర్ ఆస్పత్రిలో అన్నాచెల్లెళ్లు ఉదయ్, సుష్మ ( స్వీటీ ) చికిత్స పొందుతున్నారు. ఉదయ్, సుష్మలకు మల్టిపుల్ ఫ్యాక్చర్స్ అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరికి ఐసీయూలో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. ఈ ప్రమాదంలోనే గాయపడిన మరో వ్యక్తి ట్రీట్‌మెంట్ చేయించుకుని డిశ్చార్జ్ అయి వెళ్లిపోయినట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement