Wednesday, May 1, 2024

అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ కన్నుమూత

మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి, మహిళా జేఏసీలో చురుకైన పాత్ర పోషించి, ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలుగా కొనసాగిన అల్లం పద్మ అస్వస్థతతో కన్నుమూశారు. గత 24 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో జీవన్మరణ పోరాటం చేస్తూనే అప్పట్లో ఉద్యమంలో, ఇప్పటికీ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన ఆమె గత 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ అకాలమరణం చెందారు. ప్రధానంగా ఉస్మానియాలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో మెస్ లు కూడా మూసేసి ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిన సమైక్య పాలకులకు ఆ విద్యార్థుల ఆకలి తీర్చి ధీటైన సమాధానం చెప్పి ఎందరో విద్యార్థులకు ఆకలి తీర్చిన అమ్మ అయ్యి అమ్మల సంఘం అధ్యక్షురాలిగా నేటికీ కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం స్థాపించి ఉద్యమాన్ని ఉరకలెత్తించిన అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మక్క. ఆమె పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం రేపు ఉదయం అనగా బుధవారం ఉదయం ఎర్రగడ్డ జేక్ కాలనీ లోని ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ రోడ్ నెంబర్ 1 వద్ద ఉంచుతారు. అప్పటివరకు మృతదేహం నిమ్స్ ఆసుపత్రి లో ఉంటుంది. రేపు జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement