Monday, April 29, 2024

TS – హస్తినకు చేరిన ఆదిలాబాద్ రాజకీయం..

బిజెపి టికెట్ కోసం బిఎల్ సంతోష్ ను కలిసిన ఎంపీ సోయం..

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) ప్రధాని మోడీ ఆదిలాబాద్ పర్యటన అనంతరం బిజెపి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తొలి విడత జాబితాలో సిట్టింగ్ టికెట్టు గల్లంతైన ఎంపీ సోయంబాపురావు అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం పార్టీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి ఎల్ సంతోష్ ను కలుసుకొని అదిలాబాద్ రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు. ఆదివాసి గిరిజనుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 39 శాతం ఓటు బ్యాంకు పెరిగిందని, తాను గెలిచిన తర్వాతే నలుగురు జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఆ తర్వాత నలుగురు శాసనసభ్యులు బిజెపి తరఫున గెలిచారని బిఎల్ సంతోష్ కు వివరించారు.

పార్టీ కోసం , జిల్లా సమస్యల కోసం పాటుపడ్డ తనకు తొలి జాబితాలో టికెట్టు దక్కకపోవడం తో అసహనం వ్యక్తం చేశారు. సర్వే రిపోర్ట్ ల ప్రకారం, పార్టీకి పెరిగిన ఆదరణ సంస్థాగత అంశాలపై మరోసారి పరిశీలించి టికెట్ విషయంలో పునరాలోచిస్తామని బిఎల్ సంతోష్ హామీ ఇచ్చినట్టు ఎంపీ సోయం బాపూరావు వివరించారు. అదిలాబాద్ బిజెపి టికెట్ కోసం 43 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారని , వడపోత కార్యక్రమం సాగుతుందని రెండో జాబితాలో టిక్కెట్ దక్కుతుందనే ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. పార్టీ జాతీయ నాయకత్వం సిట్టింగ్ ల విషయంలో సానుకూల దృక్పథంతో ఉందని ఆంధ్రప్రభ కు ఎంపీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement