Saturday, May 18, 2024

సంచలనం సృష్టించిన జొమాటో కేసులో కీలక పరిణామం

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జొమాటో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సంచలన ప్రకటన చేశారు. కేసును నిలిపివేస్తున్నామని దర్యాప్తు అధికారులు ప్రకటించారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, ఆ కారణంగా దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. ఆర్డర్ ఆలస్యమైందని ప్రశ్నిస్తే.. జొమాటో డెలివరీ బాయ్ తనపై దాడి చేశాడంటూ బెంగళూరుకు చెందిన హితేషా చంద్రాణి అనే యువతి వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం సదరు జొమాటో డెలివరీ బాయ్‌ కామరాజుపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జొమాటో డెలివరీ బాయ్ కామరాజును అరెస్ట్ చేసి జైల్లో వేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన కామరాజు.. ఆమెను తాను అసలు కొట్టలేదని స్పష్టం చేశాడు. సదరు యువతి తనకు తానే కొట్టుకుందని, అన్యాయంగా తనపై ఫిర్యాదు చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. డెలివరీ ఆలస్యం అయినందుకు క్షమాపణలు కూడా చెప్పానన్నాడు.

మరోవైపు తనపై కేసు పెట్టిన అదే పోలీస్ స్టేషన్‌లో యువతిపై కామరాజు ఫిర్యాదు చేశాడు. తనను అవమానించినందుకు గాను యువతిపై కేసు పెడుతున్నట్లు డెలివరీ బాయ్ కామరాజు తెలిపాడు. ఇద్దరూ పరస్పరం ఫిర్యాదులు చేసుకోగా.. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి ఆరోపణకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాంతో తాజాగా పోలీసులు ఈ కేసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీ ఉంటే అసలు అక్కడ ఏం జరిగింది అన్న విషయం తెలిసేదని, కానీ అక్కడ సీసీ కెమెరాలు లేదని పోలీసులు చెప్పారు. యువతి చేసిన ఆరోపణల ఆధారంగా ఈ కేసులు ముందుకు వెళ్లలేమని బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు హితేషా చంద్రాణి నిరాకరించడం కూడా ఈ కేసు దర్యాప్తు నిలిపివేయడానికి ప్రధాన కారణం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement