నేడు ఇద్దరిని పరిచయం చేయాలనుకుంటున్నానని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇద్దరు టాంజానియన్ తోబుట్టువులు కిలీపాల్, నిమా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో, వార్తల్లో నిలుస్తుంటారన్నారు మోడీ. వారి గురించి ప్రజలు విని ఉంటారని భావిస్తున్నా… వారిలో భారతీయ సంగీతంపై అభిరుచి, ప్రేమ ఉన్నాయని కొనియాడారు. ఈ కారణంగానే వారిద్దరు ప్రజాదరణ పొందారని తెలిపారు. భారతీయ పాటలు, సంస్కృతికి లిప్ సింక్ చేసే విధానం అద్భుతం అన్నారు. దాన్నిబట్టే వారు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుందని చెప్పారు. తోబుట్టువులు కిలి, నీమలను గత నెల రిపబ్లిక్ డే సందర్భంగా పాడిన జాతీయ గీతం జనగణమనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయిందని ప్రధాని చెప్పారు.
కొన్ని రోజుల క్రితం కూడా లతా దీదీకి ఓ పాట పాడి ఆత్మీయ నివాళులర్పించారని అన్నారు. ఆ తోబుట్టువుల సృజనాత్మకతను అభినందిస్తున్నానని వెల్లడించారు. భారతీయ సంగీత మాయాజాలం అందరినీ ఆకట్టుకుంటోందని చెప్పారు. అలాగే, కొన్నేళ్ల క్రితం ప్రపంచంలోని 150కిపైగా దేశాల నుండి గాయకులు, సంగీతకారులు, ఆయా దేశాలలో వారి సంప్రదాయ దుస్తులలో వైష్ణవ్ జన్ పాడి గాంధీజీకి నివాళులు అర్పించారని మోడీ అన్నారు. మన సంస్కృతికి ప్రపంచం జేజేలు కొడుతోందని చెప్పారు. త్వరలోనే శివరాత్రి, హోలీ వంటి పండుగలు వరుసగా వస్తున్నాయని, మేడిన్ ఇండియా ఉత్పత్తులనే కొనాలని ఆయన సూచించారు.