Thursday, May 2, 2024

Hyderabad: దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముస్లిం మహిళలు.. ఖైరతాబాద్​లో ఉద్రిక్తత!

ఇప్పటిదాకా భాయీ భాయీ అనుకుంటూ సోదరభావంతో మెలిగే హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టే యత్నాలు మొదలయ్యాయి. ఇవ్వాల హైదరాబాద్​లోని ఖైరతాబాద్​లో జరిగిన ఓ ఇన్సిడెంట్​ అటు ముస్లింలు, ఇటు హిందువులలో ఆందోళన రేకెత్తించింది. దీంట్లో బజరంగ్​దళ్​ కార్యకర్తలు ఎంటరవ్వడంతో సున్నితమైన ఘటనకు మరింత ఆజ్యం పోసినట్టు అయ్యింది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

ఖైరతాబాద్​లోని చింతల్​ బస్తీ కులమతాలకు అతీతంగా ఉండే ప్రాంతం. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిష్టియన్లు అనే తేడాలేకుండా అంతా కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తుంటారు. ఆపద సమయంలో ఒకరినొకరు ఆదుకుంటూ చేదోడువాదోడుగా ఉంటారు. అయితే.. ఇవ్వాల అనుకోని ఓ బ్యాడ్​ ఇన్సిడెంట్​ అక్కడి ప్రజల్లో ఆందోళనకు కారణమయ్యింది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిన్న చింతల్​ బస్తీలో దుర్గామాత ప్రతిమను ప్రతిష్ఠించారు. ఘనంగా పూజలు చేశారు.

ఇవ్వాల (మంగళవారం) రెండోరోజు తెల్లవారుజామున దుర్గామత విగ్రహాన్ని కొంతమంది ముస్లిం మహిళలు ధ్వంసం చేయడం అక్కడ కాపలాగా ఉన్న బాలుడు చూశాడు. వారిని అడ్డుకోవడానికి యత్నించిన ఆ బాలుడిని సుత్తెతో దాడి చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన బుర్కా ధరించిన ఇద్దరు మహిళలు అక్కడి నుంచి నేరుగా దగ్గర్లోని చర్చిలోకి వెళ్లి అక్కడున్న మేరీమాత విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.

ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న బాలుడు వెంటనే స్థానికులను పిలిచాడు. కాగా, ఈ ఘటనపై స్థానికులు సైఫాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. కోపంతో ఉన్న ప్రజలను శాంతింపజేసేందుకు పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనకు పాల్పడ్డ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

పరిస్థితి అదుపులోనే ఉందని సైఫాబాద్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సత్తయ్య తెలిపారు. మహిళలను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అయితే.. ప్రస్తుతం వారి పేర్లను మాత్రం వెల్లడించడం లేదు. వారు మానసికంగా దెబ్బతిన్నట్టు కనిపిస్తున్నారని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనతో స్థానికుల్లో ఉద్రిక్తత నెలకొంది. హిందువుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కాబట్టి ఇలాంటి ఘటనలు చాలా అరుదు. వార్త తెలియగానే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని అమ్మవారి విగ్రహంపై దాడికి పాల్పడ్డ మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక.. తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు రజినీ మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన మహిళలు బాగా శిక్షణ పొందినట్టు ఉన్నారన్నారు. ఈ ఇద్దరు మహిళలు, ఐదుగురు మగాళ్లు ఈ ఘటనకు పాల్పడ్డట్టు తమకు సమాచారం ఉందన్నారు. వారికి సరైన శిక్షణ లేకుండా ఇట్లా దాడి చేయడం  సాధ్యం కాదని, ఈ విషయంలో హిందువులు, వృద్ధులు, యువకులు, స్త్రీలు, పురుషులు ఏకం కావాలని కోరారు.  కాగా, ఈ ఘటనను నిరసిస్తూ బజరంగ్‌ దళ్‌ సభ్యులు సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. “వీ వాంట్‌ జస్టిస్‌”.. “పీఎఫ్‌ఐ వాలో కో, గోలీ మారో సాలో కో” వంటి నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement