తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్ట్రబ్ చేసేందుకు బీజేపీ యత్నించిందనే వార్తలు, చర్చలు, వాదనలు, డిబేట్లు జనాలను పరేషాన్ చేస్తున్నాయి. దీనికి తోడు ఇవ్వాల (శుక్రవారం) సోషల్ మీడియాలో, టీవీ న్యూస్లో హల్చల్ చేస్తున్న రెండు ఆడియో క్లిప్పులు కూడా బీజేపీని దోషిగా నిలబెడుతున్నాయంటున్నారు పరిశీలకులు.
కానీ, ఈ వార్తలను, ఆడియో క్లిప్పులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కొట్టిపడేస్తున్నారు. ఇది బేజీపీ పని కాదని, కావాలంటే తామే నేరుగా చేర్చుకుంటాం కానీ, స్వామీజీలతో డీల్ చేయబోమని కిషన్రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఇక.. బండి సంజయ్ అయితే ఏకంగా యాదాద్రి నర్సింహస్వామి ఆలయంలోకి వెళ్లి తడిబట్టలతో ప్రమాణం కూడా చేశారు. ఇట్లా రెండు పార్టీల మధ్య వైరుధ్యాలు, జరుగుతున్న చర్చలు, వాదనల నడుమ మునుగోడు ప్రచారం యథాతథంగా కొనసాగుతోంది.
కానీ, ఈ నెల 31న మునుగోడులో జరుప తలపెట్టిన బీజేపీ బహిరంగ సభ విషయంలో కొంత సందిగ్ధత నెలకొందంటున్నారు పార్టీ నేతలు. పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడనికి ముందే సన్నాహాలు చేసుకున్నారు. కానీ, ఈ రెండ్రోజుల నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి జరుగుతున్న చర్చల మధ్య మునుగోడు సభ ఉంటుందా, ఉండదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఆ పార్టీ నేతలు కూడా దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు.