Friday, May 17, 2024

Spl Story: దసరా అంటే ఏంటిది?.. ఈ పండుగను ఎందుకు చేసుకుంటారు!

దసరా పండుగ అంటే ఏంటిది? ఈ పండుగను ఎందుకు జరుపుకోవాలి? అన్న ప్రశ్నలు నేటితరం యువతీ, యువకుల నుంచి వినిపిస్తున్నాయి. కొంతమంది అయితే.. దసరా పండుగ అంటే సరదాగా గడపడం, మందుతాగి, విందు చేసుకోవడం.. అనే ఫన్నీ అంశాలను చెబుతుంటారు. అయితే.. అసలు ఈ పండుగ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటిది? చారిత్రక నేపథ్యం ఏంటిదన్న విషయాలు.. దాని ముచ్చట్లు నేటి తరం యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. ఆశ్వీయుజ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని విజయదశమి అని పిలుస్తారు. ఈ పండుగ పది రోజులపాటు నిర్వహిస్తారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా కూడా చెబుతుంటారు.

ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకుంటారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు.

- Advertisement -

దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది.

మహిషాసురుని తరపున యుద్దానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా పిలుస్తున్నారు. అదే విజయదశమిగా ప్రసిద్ధి చెందింది.

విజయదశమి ప్రత్యేకత:

సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది అని అంటారు. కనుక ఆ రోజు  కొత్త విద్యలు ఏమైనా నేర్చుకుంటే మంచిదంటారు. అలానే ఆ రోజు  జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీ ప్రదమని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే  శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. అలానే జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలోనగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది అని నమ్మకం.

దసరా రోజు ఏం చెయ్యాలి?

పదవ రోజు అనగా విజయ దశమి నాడు ఉదయాన్నే లేచి తలా స్నానాలు చేసి, కొత్త బట్టలు ధరించి, మామిడి ఆకు, పూలతో తోరణాలను కట్టి అలంకరిస్తారు. పిండి వంటలు వండుకుని బందు మిత్రులతో కలిసి పంచుకుంటారు. సాయంకాలం అమ్మవారికి, జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి బంధుమిత్రులతో జమ్మి ఆకులను మార్చుకుంటారు. ఇలా ఆరోజు ఎంతో ఆనందంగా కుటుంబంతా కలిసి ఈ విజయ దశమి జరుపుకోవడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల వాళ్లు అయితే రావణాసురుని వధకి గుర్తుగా ఆనందోత్సవాలతో రావణుడి దిష్టి బొమ్మను దహనం చేయటం, పటాకులు వంటివి కాల్చి సంబురాలు చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement