Friday, May 3, 2024

టీటీడీ ఆధ్వ‌ర్యంలో – చిన్నారుల కోసం మ‌ల్టీ స్పెషాలిటీ హాస్ప‌ట‌ల్

టీటీడీ ఆధ్వ‌ర్యంలో మ‌ల్టీస్పెషాలిటీ హాస్ప‌ట‌ల్ ని నిర్మించ‌నున్నారు. చిన్నారుల‌కు అధునాత‌న వైద్యాన్ని ఈ ఆసుప‌త్రి ద్వారా అందించ‌నున్నారు. దాదాపు రూ.240 కోట్ల వ్యయంతో ఈ దవాఖానాను అందుబాటులోకి తేనున్నారు. ఈ మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి వచ్చే నెల 5న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి శంకుస్థాపన చేయ‌నున్నారు. ఈ విషయాన్ని టీటీడీ ధ‌ర్మక‌ర్తల మండ‌లి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, జేఈఓ వీర‌బ్రహ్మంతో క‌లిసి ఆయన దవాఖానాకు శంకుస్థాపన చేసే స్థలాన్ని, టాటా క్యాన్సర్ ఆసుప‌త్రిని ప‌రిశీలించారు. అక్కడ ముఖ్యమంత్రి ప‌ర్యట‌న సంద‌ర్భంగా చేప‌ట్టాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారుల‌తో సుబ్బారెడ్డి చ‌ర్చించారు. వీరి వెంట టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్వీ క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ర‌మ‌ణ‌న్ తదితరులు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేర‌కు చిన్నపిల్లల కోసం బ‌ర్డ్ ఆసుప‌త్రి ప్రాంగణంలో తాత్కాలికంగా శ్రీ ప‌ద్మావ‌తి హృద‌యాల‌య‌ను ప్రారంభించామ‌ని, ఆరు నెల‌ల వ్యవ‌ధిలో 300 గుండె ఆప‌రేష‌న్లు చేసి 300 మంది చిన్నారుల ప్రాణాల‌ను కాపాడినట్లు తెలిపారు. చిన్న పిల్లల‌కు అన్నిర‌కాల వైద్యసేవ‌లు అందించేందుకు వీలుగా మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టినట్లు చెప్పారు. టాటా ట్రస్టు నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చ్‌ దవాఖానాను సీఎం జగన్‌ ప్రారంభిస్తార‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement