Thursday, May 2, 2024

TS – విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ – బరువు తగ్గనున్న పుస్తకాలు

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు గణనీయంగా తగ్గనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల తయారీలో 90 GSM (గ్రామ్‌ పర్‌ స్క్వేర్‌ మీటర్‌) పేపర్‌కు బదులు 70 GSM పేపర్‌ వాడేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో పుస్తకాలు తేలికగా, సన్నగా మారుతాయి. కవర్‌ పేజీ ప్రస్తుతం 250 GSM ఉండగా, తాజాగా 200 GSMకు తగ్గించారు. దీంతో ఒకటో తరగతి బుక్స్‌ బరువు 1.991 కిలోల నుంచి 1.40 కిలోలకు తగ్గనుంది. అలాగే టెన్త్ క్లాస్‌ పుస్తకాల బరువు 5.37 కిలోల నుంచి 4.193 కిలోలకు తగ్గనుంది. ఈ లెక్కన ఒక్కో తరగతి పుస్తకాల బరువు 25 నుంచి 30 శాతం మేర తగ్గుతుంది.

1.90 కోట్ల ఉచిత పుస్త‌కాలు పంపిణీ…
వచ్చే విద్యా సంవత్సరంలో 1.90 కోట్ల ఉచిత పుస్తకాలను ముద్రించనున్నారు. ఇందుకు విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధంచేశారు. పుస్తకాల ముద్రణకు రూ.150 కోట్ల బడ్జెట్‌ అవసరమవుతుందని అధికారులు తేల్చారు. 2024 – 25 విద్యాసంవత్సరం నుంచి పదో తరగతిలో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో 1 నుంచి 10 తరగతుల్లోని విద్యార్థులందరికీ ద్విభాషా పుస్తకాలు (తెలుగు, ఇంగ్లిష్‌) అందజేస్తారు. పుస్తకం సైజు పెరగడంతో పుస్తకాలను పార్ట్‌ -1, పార్ట్‌ -2గా విభజించారు. ఏప్రిల్‌ 30లోపు పార్ట్‌ -1 ముద్రిత పుస్తకాలను జిల్లా పాయింట్లకు చేర్చాలని అధికారులు టార్గెట్‌ పెట్టుకొన్నారు. జూలైలో పార్ట్‌ -2 పుస్తకాలను అందిస్తారు. స్మార్ట్‌ఫోన్లలో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా స్కాన్‌చేసి అన్ని తరగతుల్లో పుస్తకాల పాఠాలను విద్యార్థులు చదువుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement