(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : బృహత్ ద్విసహస్రావధాని డా.మాడుగుల నాగఫణి శర్మ ప్రారంభించిన శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వరునికి మహా నైవేద్యంగా భాసిల్లిందని అతిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడు నగర శాసనసభ్యుడు మల్లాది విష్ణువర్ధన్, వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు, ఐఏఎస్, మా శర్మ, ఆలయ చైర్మన్ కర్ణాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు, తదితరులు ప్రశంసించారు.
నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సోమవారం నాగఫణి శర్మ అవధాన స్వర్ణోత్సవం సందర్భంగా మహాశతావధానాన్ని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి జ్యోతి ప్రజ్వలనతో వైభవంగా ప్రారంభించారు. అంతకు ముందు అవధానికి అతిధులు, అధికారులు స్వాగతం పలుకగా, వారితో కలిసి తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.
అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అవదాన సభను ప్రారంభించగా, నాగఫణి శర్మ అమ్మవారిని, ఈశ్వరుని స్తుతించారు. ఈ కార్యక్రమానికి సంధాన కర్తగా అచ్చతెలుగు అవధాని పాలపర్తి శ్యామాలానంద ప్రసాద్ వ్యవహరించగా, సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 30మంది పృచ్చకులు దత్తపదులివ్వగా అవధాని అలవోకగా అవలీలగా పూరణ చేసి ఆహుతుల ప్రశంశలందుకున్నారు. పృచ్ఛకులంతా పండితులవ్వడంతో అవధానం విశేషంగా ఆకట్టుకుందనడం అతిశయోక్తి కాదు.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/02/vijayawada-1-1-1024x536.jpg)