Thursday, April 25, 2024

Telangana: సినిమా టిక్కెట్ ధరలకు రెక్కలు

త్వరలో విడుదల కానున్న కొత్త సినిమాలకు టికెట్‌ ధరలు పెంచుకోవడానికి సినిమా థియేటర్లకు అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ధరల పెంపు నిమిత్తం థియేటర్ల యజమానులు పెట్టుకున్న దరఖాస్తులను అనుమతించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్‌ ధరలకు సంబంధించిన వివాదం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందని.. చివరిసారిగా గడువు ఇస్తున్నామని, కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

గురువారం(డిసెంబర్ 2) విడుదలైన అఖండతోపాటు ఆర్‌ఆర్‌ఆర్‌, భీమ్లానాయక్‌, పుష్ప, రాధేశ్యామ్‌ సినిమాల ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వానికి సమర్పించిన దరఖాస్తులను అనుమతించేలా ఆదేశించాలంటూ లలిత, చంద్రకళ, శశికళ తదితర పలు థియేటర్లు హైకోర్టును ఆశ్రయించాయి. అఖండకు ప్లాటినం టికెట్‌ ధర రూ.100 నుంచి రూ.150లకు, ఆర్‌ఆర్‌ఆర్‌కు రూ.250కి, భీమ్లానాయక్‌, పుష్ప, రాధేశ్యామ్‌లకు రూ.200లకు పెంచుకోవడానికి అనుమతించాలని దరఖాస్తు చేశాయి. గోల్డ్‌ టికెట్‌ ధర రూ.60 నుంచి రూ.100కు పెంచుకునేందుకు, కనీస టికెట్‌ ధర రూ.50 ఉండేలా అనుమతించాలని కోరాయి. వీటిపై న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.దుర్గాప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ సినిమా టికెట్‌ల ధరలు పెంచుతూ ప్రభుత్వం 2017లో జీవో నం. 75 జారీ చేసిందని, ఆ తరువాత వారానికే దాని అమలును నిలిపివేసిందన్నారు.

దీనిపై గతంలో థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించగా ధరలు పెంచుకోవడానికి అనుమతించిందని చెప్పారు. ఈ దశలో సినీ ప్రేక్షకుల సంఘం తరఫున ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశామని, దాన్ని అనుమతించాలని న్యాయవాది జి.ఎల్‌.నరసింహారావు కోరగా.. పిటిషనర్ల తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఇంప్లీడ్‌ పిటిషన్‌పై తరువాత విచారణ చేపడతామని న్యాయమూర్తి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement