Thursday, May 9, 2024

బిఆర్ఎస్ పార్టీ నుంచి పొంగులేటి, జూప‌ల్లి స‌స్పెండ్ ..

హైద‌రాబాద్ – బిఆర్ ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావుల‌ను ఆ పార్టీ నుంచి స‌స్సెండ్ చేశారు.. ఈ మేర‌కు బిఆర్ఎస పార్టీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించ‌డంతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులపై ఈ చ‌ర్య తీసుకున్న‌ట్లు హైకమాండ్ ప్ర‌క‌టించింది.

కాగా, నిన్న కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంతో తన మద్దతుదారులతో పొంగులేటి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జూపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, కుటుంబ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ మూడో సారి సీఎం కావాలనుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్, బీజేపీ పార్టీల సహకారంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ వచ్చినప్పుడే కేసీఆర్ గాడి తప్పారని అన్నారు. కేసీఆర్ శకం ముగియబోతోందని చెప్పారు. ఇక జూపల్లి మాట్లాడుతూ బీఆర్ఎస్ పేరుతో దేశానికి చెత్త పాలన ఇస్తారా? అని ప్రశ్నించారు. సాగునీటి టెండర్లలో మాయాజాలం ప్రదర్శిస్తూ వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని విమర్శించారు. వారి వ్యాఖ్యలను కేసీఆర్ సీరియస్ గా తీసుకుని ఆ ఇద్దరిపై సస్పెండ్ వేటు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement