Thursday, April 25, 2024

కుషినగర్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభించిన‌ ప్రధాని మోడీ

New Airport: బౌద్ధ తీర్థయాత్ర కేంద్రమైన ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ అంతర్జాతీయ విమాశ్రయం అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు బుద్ధ భగవానుడి మహాపరినిర్వాణ స్థలాన్ని సందర్శించే సౌలభ్యం సుగమంకానుంది. ప్రధానితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంది బెన్ పటేల్, పౌర విమానయాన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, శ్రీలంక క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘దేశ విమానయాన రంగాన్ని ఎయిర్ ఇండియా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సౌకర్యాలు, భద్రతకు పెద్దపీట వేస్తోంది. కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఏవియేషన్ రంగం మరింత బలోపేతం అవుతంది. మరి కొద్ది వారాల్లో ఢిల్లీ నుంచి కుషీనగర్‌కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించ‌నున్న‌ట్టు స్పైస్‌జెట్ తెలిపింది. ఇది స్థానిక ప్రయాణికులకు, సందర్శకులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది’ అన్నారు. దశాబ్దాల ఆశలు, అంచనాలకు సాకారమే కుషీనగర్ అంతర్జాతీయ విమాశ్రయమని అన్నారు. ఈరోజు తన ఆనందం రెట్టింపయిందని మోడీ పేర్కొన్నారు.

ఇండియా, శ్రీలంక బాంధవ్యం పెరుగుతుంది..

ఇండియా నుంచి అందుకున్న అతిపెద్ద బహుమతి బుద్ధిజం అని శ్రీలంక క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స అన్నారు. హిందూయిజం, బుద్ధిజం సహజీవనం సాగిస్తుంటాయని, లోతైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాయని, కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఈ బాంధవ్యం మరింత పటిష్టం కానుందని చెప్పారు. కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టే తొలి విమానం శ్రీలంక ఎయిర్‌లైన్స్‌దే కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు తమను ఆహ్వానించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

టూరిజానికి ఎంతో మేలు..

యూపీలోని లక్నోలో చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, వారణాసిలో లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి అదనంగా ఇప్పుడు కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వచ్చి చేరడంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి మరింత పెరుగుతుందని, స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనకు మార్గం సుగమం అవుతుందని యోగి సర్కార్ అంచనా వేస్తోంది. దేశంలో విమానాశ్రయ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి నిరంతర ప్రయత్నంలో భాగంగా కుషినగర్ విమానాశ్రయాన్ని కొత్త టెర్మినల్ భవనంతో 3,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. ప్రభుత్వ సహకారంతో రూ.260 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు. దేశీయ, అంతర్జాతీయ సందర్శకుల సౌలభ్యం కోసం కొత్త టెర్మినల్‌ను గరిష్ట సమయాల్లో 300 మంది ప్ర‌యాణికుల రాకపోకలు సాగించే సామర్థ్యంతో దీన్ని రూపొందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement