యాస్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న రాష్ట్రాలకు కేంద్రం వెయ్యి కోట్ల రూపాయలను తక్షణ సాయంగా ప్రకటించింది. తుపాన్ ప్రభావంతో మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. యాస్ తుఫానుతో కలిగిన నష్టాన్ని సమీక్షించి, స్వయంగా అంచనా వేసేందుకు ప్రధాని మోదీ శుక్రవారం ఒడిశా, పశ్చిమబెంగాల్లో పర్యటన సాగించారు. యాస్ తుఫాన్ బాధితులకు ప్రధాని నరేంద్రమోదీ సంఘీభావం తెలిపారు. ఈ ప్రకృతి విపత్తులో తమ వాళ్లను కోల్పోయిన కుటుంబాల దుస్థితిపై మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. యాస్ తుఫాన్ ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ప్రకటించారు. అంతేకాకుండా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.
తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని ఆధారంగా చేసుకుని ఈ సాయం ప్రకటించినట్లు వివరించారు. అదేవిధంగా తక్షణ ఆర్థిక సాయం కింద తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలకు ప్రధాని మోదీ రూ.1000 కోట్లు ప్రకటించారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. అందులో రూ.500 కోట్లు ఒడిశా రాష్ట్రానికి, మరో రూ.500 కోట్ల ఆర్థిక సాయాన్ని పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు కేటాయించినట్లు తెలిపింది. యాస్ తుపాన్ ప్రభావంతో పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.