కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో పోలీసుల చర్యల వల్ల ఏ ఒక్క రైతు ప్రాణాలు కోల్పోలేదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు పార్లమెంట్లో ప్రకటన చేసింది. తొలుత ఈ ఉద్యమంలో రైతులు చనిపోయారా.. తమ వద్ద నివేదికే లేదన్న కేంద్రం..తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యసభలో శుక్రవారం కాంగ్రెస్ నేత ధీరజ్ ప్రసాద్, ఆప్ నేత సంజరుసింగ్ సంయుక్తంగా అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాతపూర్వక సమాధానమిచ్చారు.
రైతులు చేపట్టిన ఆందోళనల్లో ఏ ఒక్క రైతు పోలీసుల చర్య వల్ల చనిపోలేదని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ఇక ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం, ఇతర అంశాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవి ఆయన తెలిపారు. కాగా, వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన కేంద్రం.. రైతులు లేవనెత్తిన డిమాండ్లను నెరవేరుస్తామని హామీనివ్వడంతో.. రైతు సంఘాలు ఉద్యమాన్ని విరమించుకుని ఇళ్ల బాట పట్టాయి. అయితే ఈ హామీలను నెరవేర్చకుంటే తమ ఆందోళనలను తిరిగి ప్రారంభిస్తామని రైతు సంఘాలు హెచ్చరించాయి.