ఇప్పుడు టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చేసింది. రకరకాల సేవలు ఆన్లైన్ ద్వారా చేసుకునే సదుపాయం వచ్చేస్తోంది. బ్యాంకింగ్ రంగం నుంచి ఇతర సేవల దాకా అన్నీ ఆన్లైన్ ద్వారా చేసుకునే వెసులుబాటు ఉంది. మరి వాహనాలకు సంబంధించిన సేవల కోసం ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలి అన్న ఆలోచనతో అధికారులు దీన్ని కూడా మరింత ఈజీ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి పలు రకాల సేవలను కంప్లీట్ చేసుకునే ఫెసిలిటీ కల్పించబోతున్నారు. వాహనం రిజిస్ట్రేషన్, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్, డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఇతర సేవలు ఇక నుంచి ఆన్లైన్లో పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఆధార్ అథంటికేషన్ ఆధారంగా మొత్తం 58 పౌర సంబంధిత సేవలను ఆన్లైన్ ద్వారా పొందవచ్చని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూగీ జారీ చేసింది. లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, డూప్లికేట్ లైసెన్స్, అలాగే లైసెన్స్ రెన్యువల్ వంటి సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని కేంద్ర సర్కార్ విడుదల చేసిన తన నోటిఫికేషన్లో పేర్కొంది. అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్, లైసెన్స్లో చిరునామా మార్పు, వాహన ఓనర్షిప్ తదితర సర్వీసులు ఆన్లైన్లోనే లభిస్తాయని తెలిపింది. అయితే డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే మాత్రం డైరెక్ట్గానే హాజరు కావాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ఇలా సేవలు ఆన్లైన్ ద్వారా చేయడం వల్ల ఆర్టీవో కార్యాలయంపైనా భారం తగ్గుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.