Monday, April 29, 2024

ప‌టాకుల‌పై పూర్తి నిషేధం వ‌ద్దు-కేజ్రీవాల్ కి లెట‌ర్ రాసిన సీఎం స్టాలిన్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి లెట‌ర్ రాశారు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్. ఢిల్లీలో పటాకులను పూర్తిగా నిషేధించవద్దని, అనుమ‌తించ‌ద‌గిన నిబంధ‌న ప్ర‌కారం.. పటాకుల అమ్మకాలను అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాల ప్రకారం.. రాజధానిలో పటాకుల విక్రయాలకు అనుమతి ఇవ్వాలని స్టాలిన్ కోరారు. ప్రస్తుతం ఢిల్లీలో పటాకుల అమ్మకం, ఉత్పత్తి, వినియోగంపై పూర్తి నిషేధం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. తమిళనాడులోని శివకాశి వార్షిక ఆదాయంలో 70% దీపావళి రోజున పటాకుల అమ్మకం ద్వారా వస్తుందని స్టాలిన్ తెలిపారు. వారిని ఆర్థికంగా లాభపడేలా దీపావళి సంద‌ర్బంగా ఢిల్లీలో పటాకుల అమ్మకానికి అనుమ‌తి ఇవ్వాల‌ని స్టాలిన్ కోరారు. మరే ఇతర రాష్ట్రం పటాకులపై పూర్తి నిషేధం విధించనప్పుడు ఢిల్లీలో ఎందుకు అన్ని ప్ర‌శ్నించారు.

ప‌టాసుల అమ్మకాల‌కు అనుమ‌తిస్తే…శివకాశి చుట్టూ ఉన్న లక్షలాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. ముఖ్యంగా ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న గ్రామీణ మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని శివకాశి నగరం భారతదేశంలో బాణసంచా తయారీదారుల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దాదాపు 6.5 లక్షల కుటుంబాలు తమ జీవనోపాధి కోసం ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్నార‌ని పేర్కొన్నారు. దీపావళి రోజున రెండు గంటల పాటు పటాకులు కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చిందని స్టాలిన్ తెలిపారు. దీపావళి క్రాకర్స్ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న తమిళనాడులోని ఒక వర్గానికి నష్టం కలిగించే విధంగా ఢిల్లీలో పటాకుల అమ్మకాలపై నిషేధాన్ని ఎత్తివేయాలన్నారు. చలికాలం వస్తే చాలు ఢిల్లీలో వాతావరణ కాలుష్యం భారీగా పెరుగుతున్నదనీ, కాలుష్యం స్థాయి భారీగా పెరగటం కారణంతో ప్రభుత్వం నిషేధించడం ఇది మూడోసారి. మ‌రి కేజ్రీవాల్ ఏం నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement