Sunday, April 28, 2024

కేజ్రీవాల్ తో నితీశ్ కుమార్ భేటీ..

బిహార్ సీఎం..జేడీయూ నేత నితీశ్ కుమార్ బ‌ల‌మైన విప‌క్ష కూట‌మిని ఏర్పాటు చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆరేషన్‌ జోడో మిషన్‌లో భాగంగా బీజేపీ యేతర పార్టీల నేతలతో సమావేశమవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో స‌మావేశ‌మ‌య్యారు. బీహార్‌ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ , పార్టీ నేతలు మనోజ్‌ ఝా, లలన్‌ సింగ్, సంజయ్‌ ఝాతో కలిసి న్యూఢిల్లీ చేరుకున్న నితీశ్‌.. ఫ్లాగ్‌ స్టాఫ్‌ రోడ్డులోని కేజ్రీవాల్‌ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీని మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే తమతో కలిసి రావాలని కేజ్రీని కోరనున్నారు.

ఢిల్లీలో పాలనాధికారాలకు సంబంధించి రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాలతో కలిసి పోరాడుతామని కేజ్రీవాల్‌ ప్రకటించిన తెల్లారే సీఎం నితీశ్‌ ఆయనతో భేటీ కావడం విశేషం. ఈ నెల 11న రాజకీయ కురు వృద్ధుడు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ , మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో ముంబైలో నితీశ్‌ కుమార్‌ సమావేశమైన విషయం తెలిసిందే. బీజేపీ పాలనలో దేశం నాశనమవుతోంది. అందువల్ల ఎంత ఎక్కువ సంఖ్యలో విపక్ష పార్టీలు ఏకమైతే, దేశానికి అంత మంచిది. వేరే రాజకీయ పార్టీలను కూడా సంప్రదిస్తున్నాం. సరైన సమయంలో అందరం కూర్చుని భవిష్యత్ కార్యాచారణ నిర్ణయిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. అంతకుముందు ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ తో సమావేశమయ్యారు. ప్రత్యేకంగా భువనేశ్వర్ వెళ్లి నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరిపారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ తో కూడా సమావేశమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement