Monday, April 29, 2024

అక్షయ తృతీయ నాడు బంగారం ఎందుకు కొనాలి ?

అక్షయ తృతీయ ఉత్తర భారతీయులకు మాత్రం ఇదో పర్వదినం. జీవితంలో అన్నింటినీ అక్షయం చేసే పర్వదినం కాబట్టే దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది. వైశాఖ మాసంలో తదియ నాడు వచ్చే అక్షయ తృతీయ హిందువులకు చాల పవిత్రమైన రోజుగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున చేసే పనుల వల్ల రెట్టింపు ఫలితం వస్తుందని చాలా మంది నమ్ముతారు. అక్షయ తృతీయ నాడు కొన్న బంగారం భవిష్యత్తులో చాలా రెట్లు పెరుగుతుందని చాలా మంది విశ్వాసం. అందుకే ఈ పవిత్రమైన రోజున బంగారం కొనడానికి ప్రజలందరూ శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు ఈరోజు బంగారం కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని, తమ జీవితంలో ఆనందం లభిస్తుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం ఈరోజు సూర్య చంద్రులు అత్యంత ప్రకాశంగా ఉండే రోజు. ఈ పవిత్రమైన రోజున ఏ పని చేపట్టినా.. తప్పకుండా విజయం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

పురాణ కాలం నుంచి అక్షయ తృతీయ ప్రస్తావన వుంది.నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజు ఇదే అని అంటారు. మహా విష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు జన్మించింది కూడా ఈ రోజునేనట. ఈ పండుగ రోజున పుష్పమో, ఫలమో భగవంతుడికి అర్పించినా, దైవనామస్మరణ చేసినా అక్షయమైన సంపద పుణ్యం లభిస్తాయని ప్రతీతి. ఈ రోజు కచ్చితంగా బంగారం, వెండి లేదా ఇతర విలువైన వస్తువులు కొనడం పురాతన కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. త్రేతాయుగం ఈ రోజునే ప్రారంభం కావడం, పరశురాముడిగా శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించడం వల్ల ఈ తిథికి అంత విశిష్టత వచ్చింది. అందుకే ఈ పర్వదినాన ఐశ్వర్యాలకు అధినేత్రి అయిన శ్రీమహాలక్ష్మి అమ్మవారికి పూజలు చేసి.. ఆరోజు బంగారం కొంటారు. దీనివల్ల ఏడాదంతా తమ వద్ద సిరులు ఉంటాయని నమ్మకం. ఈ రోజు చేసే దానాలు అనుష్టానపరులకు, యోగ్యులకు చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు సంతృప్తి చెంది అనుగ్రహిస్తాడని శాస్త్ర వచనం.  మనలో జీవుడు మరొక శరీరంలో ప్రవేశించిన తరువాత కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా అక్ష్జమై సంపదలు కలుగచేసేదే ఈ పండుగ.  ఈ రోజు బంగారు వ్యాపారులకు మాత్రం పసిడి పంటే అని చెప్పాలి. కొన్న వాళ్లకేమో కానీ, వ్యాపారుల ఇంటికి మాత్రం లక్ష్మీదేవి పరుగెత్తుకుంటూ వెళ్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement