Friday, July 26, 2024

బీజేపీ బట్టేబాజ్ మాటలతో అభివృద్ధి జరగదు: ఎమ్మెల్సీ కవిత

బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేవలం రాజకీయాల కోసం మాట్లాడే వారికి కాకుండా ప్రజల కోసం బాధ్యతతో పనిచేసే నాయకులకే మద్దతుగా నిలవాలని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్ గల్ లో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాదాపు 30 కోట్ల రూపాయలతో భీమ్ గల్ పట్టణంలో ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు ప్రారంభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ఏడేండ్లలో తెలంగాణ దేశంలోనే అగ్రరాష్ట్రంగా నిలిచిందన్నారు. దీనికి సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలే కారణమన్నారు. రాష్ట్రం కోసం ఎంత ప్రేమతో కొట్లాడినమో, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ అంతే చిత్తశుద్దితో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతుంటే, కొంత మంది రాజకీయాల కోసం ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమనటం సరికాదని పేర్కొన్నారు. కొందరు బీజేపీ నాయకులు కేవలం రాజకీయాల కోసం బట్టేబాజ్ మాటలు చెప్తున్నారని విమర్శించారు. పనిచేసే నాయకులకు ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందన్న ఎమ్మెల్సీ కవిత.. సీఎం కేసీఆర్ ని రాష్ట్ర ప్రజలు రెండు సార్లు దీవించి ముఖ్యమంత్రిగా గెలిపించారని గుర్తు చేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భీమ్ గల్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. బాల్కొండను బంగారు బాల్కొండగా మార్చే భాద్యత తమదన్నారు. భీంగల్ ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నామని, భీంగల్ పట్టణంలో త్వరలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement