Tuesday, April 30, 2024

TS | తిర్పూర్ క్ల‌స్ట‌ర్ కంటే ఇంకా బాగా చేద్దాం.. నేత‌న్న‌ల‌కు ఉపాధి క‌ల్పిద్దాం: మంత్రి కేటీఆర్‌

బీఆర్‌కే భ‌వ‌న్‌లో టెక్స్‌టైల్ శాఖ‌పై మంత్రి కేటీఆర్ ఇవ్వాల (శుక్ర‌వారం) రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా టెక్స్‌టైల్‌ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై, వాటి అమలు తీరుపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే అత్యంత ఆదర్శంగా ఉన్న తమిళనాడులోని తిర్పూర్ క్లస్టర్ మాదిరి ఒక సమీకృత పద్ధతిన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన పవ‌ర్‌లూమ్‌ క్లస్టర్లను తెలంగాణలో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కేటీఆర్ అధికారులకు సూచించారు.

– ఇంట‌ర్నెట్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌

త‌మిళ‌నాడులోని తిర్పూర్ క్లస్టర్‌లో పర్యటించి అక్కడ ఉన్న ఆదర్శవంతమైన పద్ధతులను, అక్కడి నేతన్నలు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకున్న తీరు, వారు అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ), జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా చేస్తున్న నేత ఉత్పత్తుల తయారీ వంటి అనేక అంశాల పైన విస్తృతంగా అధ్యయనం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారుల‌కు సూచించారు. తిర్పూర్ లాంటి పవర్‌లూమ్‌ క్లస్టర్ల స్ఫూర్తితో తెలంగాణలోనూ నేతన్నల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు, వారి ఆదాయాలను మరింత పెంచేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన కార్యాచరణను వెంటనే ప్రతిపాదించాలని టెక్స్‌టైల్ శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.

నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో పనిచేస్తుందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ దిశానిర్దేశంలో ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనివిధంగా నేతన్నల సంక్షేమం కోసం విభిన్న కార్యక్రమాలను చేపట్టిన‌ట్లు వెల్ల‌డించారు. నేతన్నలకు అత్యంత సులువుగా ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా అధికారులు తమ కార్యాచరణ కొనసాగించాలన్నారు. ఈ సందర్భంగా నేతన్నలకు అందిస్తున్న చేనేత మిత్ర లాంటి కార్యక్రమాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని పథకాలు అత్యంత సులభంగా నేతన్నలకు అందేలా అవసరమైన మార్పులను.. నేతన్నల సూచనల మేరకు చేయాలని సూచించారు.

- Advertisement -

టెక్స్‌టైల్ రంగాన్ని ప్రాధాన్య‌తగా తీసుకోవాలి..
రాష్ట్రంలో టెక్స్‌టైల్ రంగం అభివృద్ధి కోసం ఒక ప్రాధాన్యతగా గుర్తించిన ప్రభుత్వం, రాష్ట్రంలో అభివృద్ధి కోసం మౌలిక వసతుల కల్పన కార్యక్రమానికి అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చింద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మినీ టెక్స్‌టైల్ పార్కులు, టెక్స్‌టైల్ పార్కులు, అప్పారెల్ పార్కుల అభివృద్ధిని చేపట్టామన్నారు. ఆయా పార్కుల్లో ఇంకా మిగిలిపోయిన పనులు ఏవైనా ఉంటే వెంటనే వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో బ్లాక్ లెవ‌ల్ క్లస్టర్ల పనితీరుపైన, వాటి పురోగతిపైన ఒక నివేదికను వెంటనే తయారు చేసి అందివ్వాలని ఆదేశించారు. గుండ్ల పోచంపల్లి అప్పారెల్ పార్క్, గద్వాల్ హ్యాండ్లూమ్ పార్క్ కార్యక్రమాలపైన మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు.

సంక్షేమ కార్య‌క్ర‌మాలతో చేనేత‌కు భ‌రోసా..
ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా చేనేత రంగానికి ఎంతగానో భరోసా లభించిన విషయాన్ని ప్రస్తావించిన కేటీఆర్, చేనేత రంగంలోని నేతన్నల కళకు, వృత్తికి మరింత ఆదాయం వచ్చేలా తీసుకోవాల్సిన కార్యక్రమాలపైన అధ్య‌యనం చేయాలని అధికారులను కోరారు. చేనేత కార్మికులు అధికంగా ఉన్న నారాయణపేట, గద్వాల్, దుబ్బాక, కొడకండ్ల, మహాదేవపూర్, కొత్తకోట వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన పనులపైన అధికారులు క్షేత్రస్థాయిలో మరింత అధ్యయనం చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఒక కార్యాచరణ రూపొందించాలన్నారు.

జాతీయ చేనేత దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాలి..
ఆగస్టు 7వ తేదీన నిర్వ‌హించ‌బోయే జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆ రంగంలోని అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న నేతన్నలకు గుర్తింపునిచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ నగరంలో చేనేత మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఒకవైపు చేనేతల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను భారీ ఎత్తున కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఉపాధి కోసం నేతన్నలు విస్తృతంగా ఆధారపడిన పవర్‌లూమ్‌ రంగం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement