Friday, May 3, 2024

కర్ణాటకలో సంపూర్ణ లాక్ డౌన్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో అనేక రాష్ట్రాలు తల్లడిల్లిపోతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తి అదుపులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు కర్ణాటక సర్కార్ ప్రకటించింది.  ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటల నుంచి 10 వరకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రకాలైన ప్రజా రవాణాను ఆపేస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.

లాక్ డౌన్ రోజుల్లో వ్యవసాయ రంగాలు, నిర్మాణ రంగాలు మాత్రమే తమ కార్యకలాపాలు కొనసాగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైన విమానాలు, రైళ్లను మాత్రం అనుమతిస్తామని వెల్లడించింది. లాక్ డౌన్ కాలంలో మెట్రో రైలు సేవలు కూడా ఉండవని తెలిపింది. ట్యాక్సీలు, ఆటోలకు అనుమతి లేదని, అత్యవసర సమస్యలు ఉన్నవారికి మాత్రమే ట్యాక్సీలను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. రెస్టారెంట్లు, హోటళ్లను కస్టమర్ల కోసం తెరవడానికి వీల్లేదని పేర్కొంది. అయితే, ఆహారాన్ని హోమ్ డెలివరీ చేయవచ్చని తెలిపింది. కాగా, గత కొద్ది రోజులుగా కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో యడియూరప్ప ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement