Friday, May 10, 2024

TS | హైకోర్టు సీజేగా జ‌స్టిస్ అలోక్ ప్ర‌మాణ‌ స్వీకారం.. గ్రీటింగ్స్ తెలిపిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే ఇవ్వాల (ఆదివారం) ఉద‌యం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సీఎం కేసీఆర్ , మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లారెడ్డి, మహమూద్‌ అలీ, ఎంపీ కే.కేశవరావు, మండలి చైర్మన్‌ సుఖేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్‌ పాల్గొన్నారు.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆయన స్థానంలో జస్టిస్‌ అరాధేను నియమితుల‌య్యారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటు తర్వాత జస్టిస్‌ అరాధే ఆరో ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. సీఎం కేసీఆర్‌ నూతన సీజేకు పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, జస్టిస్‌ అలోక్‌ అరాధే.. 1964, ఏప్రిల్‌ 13న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జన్మించారు. 1988, జులై 12న న్యాయవాదిగా ప్రస్థానం ప్రారంభించారు. 2009 డిసెంబర్‌ 29న మధ్యప్రదేశ్‌ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2016, సెప్టెంబర్‌ 16న జమ్ముకశ్మీర్‌ న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2018లో మూడు నెలలపాటు జమ్ముకశ్మీర్‌ తాత్కాలిక సీజేగా బాధ్యతలు నిర్వహించారు. 2018, నవంబర్‌ 17 నుంచి క‌ర్నాట‌క‌ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వ‌హించారు. కొంతకాలం క‌ర్నాట‌క‌ తాత్కాలిక సీజేగా కూడా పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement