Friday, May 17, 2024

హైద‌రాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో మైన‌ర్ల బెయిల్ పిటిష‌న్ ర‌ద్దు.. పోలీసుల వాద‌న‌ను అంగీక‌రించిన‌ కోర్టు

హైద‌రాబాద్‌లో పెను క‌ల‌క‌లం రేపిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులుగా ఉన్న మైనర్లు దాఖ‌లు చేసిన‌ బెయిల్ పిటిష‌న్ల‌ను జువెనైల్ జ‌స్టిస్ కోర్టు బుధ‌వారం తిర‌స్క‌రించింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితుల‌కు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు చేసిన వాద‌న‌ల‌తో ఏకీభ‌వించిన జువెనైల్ జ‌స్టిస్ బోర్డు నిందితుల బెయిల్ పిటిష‌న్ల‌ను కొట్టేసింది.

ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా… వారిలో ఒకరు మేజ‌ర్ ఉన్నాడు. మిగిలిన ఐదుగురు మైన‌ర్లే. వీరిలో న‌లుగురు మైన‌ర్లు త‌మ‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని జువెనైల్ జ‌స్టిస్ కోర్టులో పిటిష‌న్‌ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్ల‌పై జువెనైల్ జ‌స్టిస్ బోర్డు మంగ‌ళ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. ఈ విచార‌ణ సంద‌ర్భంగా త‌మ‌కు బెయిల్ ఇవ్వాల‌ని నిందితులు కోరారు.

అయితే.. న‌లుగురు మైన‌ర్లు సమాజంలో ప‌లుకుబ‌డి క‌లిగిన వారి పిల్ల‌లేన‌ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసు ద‌ర్యాప్తు ద‌శ‌లో ఉన్న స‌మ‌యంలో వీరికి బెయిల్ ఇస్తే.. బాధితుల‌తో పాటు సాక్షుల‌ను కూడా నిందితుల కుటుంబాలు ప్ర‌భావితం చేసే ప్ర‌మాదం ఉంద‌ని పోలీసులు తెలిపారు. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న జువెనైల్ జ‌స్టిస్ బోర్డు.. నిందితులకు బెయిల్ నిరాక‌రిస్తూ వారి పిటిష‌న్ల‌ను కొట్టేసింది. ఇదిలా ఉంటే.. ఐదో మైన‌ర్ కూడా రేపు (గురువారం) జువెనైల్ జ‌స్టిస్ కోర్టులో బెయిల్ పిటిష‌న్ వేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement