Wednesday, May 1, 2024

స్మితా సబర్వాల్‌కు హైకోర్టు షాక్‌.. పరువునష్టం కేసులో ప్రభుత్వ ధనం వినియోగంపై అభ్యంతరం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు హైకోర్టు షాకిచ్చింది. ప్రైవేట్‌ సంస్థపై ప్రైవేట్‌ వ్యక్తిగా పరువు నష్టం దావా వేసి ప్రభుత్వానికి చెందిన రూ. 15 లక్షలను తిరిగి ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశించింది. సీఎంవోలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితా సబర్వాల్‌ 2015లో అవుట్‌లుక్‌ అనే మ్యాగజైన్‌పై తన ఫొటోను అభ్యంతరకరంగా ముద్రించారన్న అభియోగంపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షలను మంజూరు చేసింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అవుట్‌లుక్‌ మ్యాగజైన్‌లో పాటు మరో ఇద్దరు హైకోర్టులోనే వ్యాజ్యం వేశారు. ప్రైవేట్‌ వ్యక్తి ప్రైవేట్‌ సంస్థపై వేసిన కేసు విచారణకు ప్రభుత్వం డబ్బులు మంజూరు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని పేర్కొంది. తీసుకున్న డబ్బులను మూడు నెలల్లోగా ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని స్మితా సబర్వాల్‌ను ఆదేశించింది. స్మితా సబర్వాల్‌ ప్రైవేట్‌ వ్యక్తిగా పరువు నష్టం దావా వేశారన్న కోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అసమంజసంగా ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ నిర్ణయం సహేతుకంగాలేదని కోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేనప్పుడు కోర్టులు సమీక్షించవచ్చని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement