Sunday, May 5, 2024

అప్పుడు సీఎంగా..ఇప్పుడు ప్రధానిగా

సైన్యంలో విధులు నిర్వహిస్తోన్న ఓ మేజర్ కి అప్పట్లో గుజరాత్ సీఎం.. ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో తన పాత జ్ఞాపకాన్ని పంచుకునే అవకాశం వచ్చింది. ఈ అరుదైన సంఘటనకు ప్రధాని మోడీ కార్గిల్ పర్యటన వేదికగా మారింది. గుజరాత్ కు చెందిన అమిత్ బాలాచాడిలోని సైనిక్ స్కూలులో చదువుకున్నారు. 2001 సంవత్సరంలో బాలాచాడి స్కూలులో జరిగిన ఓ కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమిత్ ఓ షీల్డ్ అందుకున్నారు. తర్వాత చదువు పూర్తిచేసుకున్న అమిత్.. భారత సైన్యంలో చేరి మేజర్ అయ్యారు. ప్రస్తుతం కార్గిల్ లో విధులు నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా మోదీ కార్గిల్ లో పర్యటిస్తారని తెలియడంతో అమిత్ సంతోషం పట్టలేకపోయారు.

వెంటనే తన చిన్ననాటి ఫొటో ఫ్రేంను తెప్పించుకుని, ప్రధానికి ఆ ఫొటో చూపించే క్షణాల కోసం ఆతృతగా ఎదురుచూశారు. ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి మోదీ ఏటా దీపావళి పండుగను సైనికులతో జరుపుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది కార్గిల్ లో పర్యటించారు. అక్కడి సైనికులతో వేడుకలు జరుపుకుంటుండగా.. అమిత్ ఆయన దగ్గరికి వచ్చి చిన్నప్పటి సంగతిని గుర్తుచేశాడు. అప్పటి ఫొటోను మోదీకి చూపించారు. ఇద్దరూ అప్పటి విశేషాలను గుర్తుకుతెచ్చుకున్నారు. అమిత్ తో పాటు ప్రధాని కూడా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆనాటి ఫొటోను పట్టుకుని ప్రధాని మోడీ, మేజర్ అమిత్ మళ్లీ ఫొటో దిగారు.ఇప్పుడీ ఫొటో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement