Friday, May 3, 2024

ఈవీఎంల భద్రత కోసమే ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ల నిర్మాణం : ఎలక్షన్ సీఈఓ శ‌శాంక్ గోయల్

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : ఎన్నికల ప్రక్రియలో ప్రధాన భూమికను పోషించే ఈవీఎంల భద్రత కోసమే ఎలక్షన్ ఈవీఎం గోడౌన్లను నిర్మించామని ఎలక్షన్ సీఈఓ శశాంక్ గోయల్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రి ఆవరణలో ఆదివారం నూతనంగా నిర్మించిన ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ ను ఎలక్షన్ సీఈఓ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలక్షన్ వివి ప్యాట్ ను పోలిన కేక్ ని కట్ చేసిన అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు హృదయం లాంటివని అన్ని జిల్లాల్లో ఎలక్షన్ ఈవీఎంలను భద్రపరిచేందుకు ప్రత్యేక గోడౌన్ ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నూతనంగా ఏర్పాటు చేసిన అన్ని జిల్లాలలో ఈవీఎం గోడౌన్ ల నిర్మాణం చేపట్టామని, రాష్ట్రవ్యాప్తంగా 22 గోడౌన్ల నిర్మాణం చేపట్టగా ,నేటికి 20 పూర్తయ్యాయని నారాయణపూర్, కామారెడ్డి జిల్లాలలో నిర్మాణ ప్రగతిలో ఉన్నాయని ఈ నెలాఖరులోగా వాటిని కూడా పూర్తి చేస్తామని, పోలీస్ బందోబస్తుతో ఈవీఎంలను ఈ గోడౌన్లలో భద్రపరిచి భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలను పారదర్శకంగా నిర్మించేందుకు ఉపయోగిస్తామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement