Friday, April 26, 2024

Eatala: సీఎం కేసీఆర్ ఎన్నెకరాలు కబ్జా చేసి ఉంటారు?: ఈటల సంచలన ఆరోపణ

హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ భూక‌బ్జా వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఈటల రాజేందర్ భూకబ్జా వాస్త‌వమేనంటూ మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రీశ్ పేర్కొనడం రాజకీయంగా సంచలనమైంది. కలెక్టర్ వ్యాఖ్యలను ఖండించిన ఈటల భార్య జమున.. ఆయనపై కేసు పెడుతామని ప్రకటించారు.

తాజాగా భూకబ్జా ఆరోపణలపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో జరిగిన బీజేపీ పదాధికారుల రెండు రోజుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి హాజరైన ఈటల.. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న తానే రైతులను బెదిరించి 70 ఎకరాల అసైన్డ్‌ భూములను తీసుకుంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్‌ ఇంక ఎంత మందిని భయపెట్టి హైదరాబాద్‌ కొండాపూర్, రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో ఎన్ని వేల ఎకరాలు తీసుకుని ఉంటారని ఆయన ప్రశ్నించారు. జమునా హేచరీస్‌ సంస్థలో ఒక్క ఎకరం కబ్జాలో ఉన్నట్టు తేలినా ముక్కు నేలకు రాస్తానని తన భార్య జమున చెప్పినమాటకు కట్టుబడి ఉంటానని రాజేందర్‌ స్పష్టం చేశారు. సిస్టం అంటూ ఒకటి ఉంటుందని, అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలన్నారు. తాను భూములు కబ్జా చేశానని అనడం మతిలేని చర్య అని పేర్కొన్నారు.

కాగా, ఈట‌ల రాజేంద‌ర్ భూక‌బ్జా వాస్త‌వమేన‌ని మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రీశ్ నిన్న(డిసెంబర్ 6) చెప్పారు. ఈట‌ల భూముల అంశంపై మెద‌క్ క‌లెక్ట‌ర్ మీడియాతో మాట్లాడారు. మాసాయిపేట మండ‌లం అచ్చంపేట‌, హ‌కీంపేట్ ప‌రిధిలో అసైన్డ్ భూముల‌ను జ‌మునా హ్యాచ‌రీస్ క‌బ్జా చేసింది వాస్త‌వ‌మేన‌ని చెప్పారు. 70.33 ఎక‌రాల భూమిని క‌బ్జా చేసిన‌ట్లు రెవెన్యూ అధికారుల స‌ర్వేలో తేలింద‌న్నారు. అచ్చంపేట‌, హ‌కీంపేట ప‌రిధిలో గల సర్వే నంబర్ 77 నుంచి 82, 130, హ‌కీంపేట్‌ శివారులో గల సర్వే నంబర్ 97, 111లో సీలింగ్ భూముల‌ను క‌బ్జా చేశారని చెప్పారు. స‌ర్వే నంబ‌ర్ 78, 81, 130ల‌లో భారీ పౌల్ట్రీ షెడ్స్, ప్లాట్‌ఫామ్‌లు, రోడ్లను అనుమ‌తి లేకుండా నిర్మించారని తెలిపారు. స‌ర్వే నంబ‌ర్ 81లో 5 ఎక‌రాలు, 130లో 3 ఎక‌రాల‌ను అక్ర‌మంగా రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నారని పేర్కొన్నారు. మొత్తంగా 56 మంది అసైనీల భూముల‌ను క‌బ్జా చేసిన‌ట్లు తేలింద‌న్నారు.

 అయితే, ఈ కలెక్టర్ వ్యాఖ్యలపై ఈటల భార్య జమున స్పందించారు. తమపై తప్పుడు ప్రకటన చేసిన జిల్లా కలెక్టర్ పై కచ్చితంగా కేసులు పెడతామని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, గులాబీ కండువా కప్పుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. తమ వ్యాపారాలకు అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు సాక్షాత్తు అధికారులే చెపుతున్నారని తెలిపారు. తమ స్థలంలో పెద్ద షెడ్లు వేసుకుంటే తప్పేముందని ఆమె ప్రశ్నించారు. 
తన భర్త టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ప్రభుత్వ పెద్దలు ఒకలా వ్యవహరించారని… టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరోలా ఉన్నారని జమున విమర్శించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement