Thursday, April 25, 2024

ఆ రైతుల‌కు రైతుబీమా, రైతుబంధు ఉండ‌వు.. సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం

Ganja Matter’s: తెలంగాణ‌లో గంజాయి లభ్యత పెరిగినట్లు సమాచారం అందుతున్న నేపథ్యంలో.. పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పటిష్టమైన వ్యూహం రూపొందించుకొని, గంజాయి, గుడుంబా, గుట్కాను సమూలంగా నిర్మూలించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సంధర్భంగా స‌మీక్ష‌ నిర్వహించిన సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ క్రమంలోనే గంజాయి సాగు చేస్తే.. రైతుల పట్టాలను కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. గంజాయిపై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందన్న కేసీఆర్‌.. పరిస్థితి తీవ్రతరం కాకముందే అప్రమత్తం కావాల‌ని అధికారుల‌కు సూచించారు. గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి తగిన ప్రణాళికను రెడీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

గంజాయిపై సీరియస్‌గా వ్యవహరించాలన్న సీఎం కేసీఆర్.. విద్యాసంస్థల వద్ద నిఘా పెంచాలన్నారు. అలాగే పాఠ్యపుస్తకాల్లో డ్రగ్స్ ప్రమాదాలపై పాఠాలు పెట్టాలన్నారు. బోర్డర్ వ‌ద్ద‌ చెక్ పోస్టుల సంఖ్య పెంచడం, సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. అటు గంజాయిని నిరోధించడానికి డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలన్నారు.

ఇంటలిజెన్స్ శాఖలో కూడా ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని చెప్పారు. గంజాయి నిర్మూలనలో ఫలితాలు సాధించిన అధికారులకు క్యాష్ రివార్డులు, ప్రత్యేక ప్రమోషన్లు, మొదలైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికి పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పటిష్టమైన వ్యూహం రూపొందించుకొని, గంజాయి, గుడుంబాలను సమూలంగా నిర్మూలించాలని అధికారులకు సూచించారు.

ముఖ్యంగా ఆంధ్రా – ఒడిశా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతంలో గంజాయి ఉత్పత్తి జరుగుతున్నదని అక్కడి నుంచి చింతూరు – భద్రాచలం మీదుగా తెలంగాణ‌లోకి ప్రవేశించి, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు రవాణా జరుగుతున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీన్ని అరికట్టేందుకు ఇతర రాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్ శాఖలతో సమన్వయ వ్యవస్థ అవసరం ఉందని వారు పేర్కొన్నారు.

- Advertisement -

రాష్ట్రంలోకి ఎక్కువశాతం గంజాయి ఇతర రాష్ట్రాల నుంచే వస్తున్నదని ఛత్తీస్ గఢ్ లో సైతం గంజాయి సాగు, సరఫరా జరుగుతున్నదని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఇక గంజాయిని వినియోగిస్తున్న వారిలో వలస కూలీలు, యువకులు ఎక్కువగా ఉన్నారని, ఆటో డ్రైవర్లు, హమాలీలు కూడా ఉన్నట్లు వారు సీఎంకు వివరించారు.

గంజాయి నిర్మూలనపై బలంగా దృష్టి కేంద్రీకరిస్తే, అతి తక్కువ కాలంలోనే రాష్ట్రంలో దీని పీడ విరగడ చేయవచ్చని, అందుకోసం కావాల్సిన సూచనలను అధికారులు తెలియజేశారు. ఎక్సైజ్, పోలీసుశాఖలతోపాటు అటవీశాఖ చెక్ పోస్టుల్లో సైతం నిఘా పెంచాల్సిన అవసరం ఉన్నదని సమావేశంలో చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement