Wednesday, May 8, 2024

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి క‌ష్టాలు-సుముఖ‌త చూప‌ని నేత‌లు-శ‌శిథ‌రూర్ ఏమ‌న్నారంటే

కాంగ్రెస్ అధ్యక్ష ప‌ద‌వికి ఈ ఏడాది అక్టోబ‌ర్ 17న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబర్ 19న ఈ ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తారు. ఈఎన్నికల నోటిపికేషన్ ను సెప్టెంబర్ 22న విడుదల చేయ‌నున్నారు. సెప్టెంబర్ 24 నుండి సెప్టెంబర్ 30 వరకు అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలుకు సమయం ఇచ్చారు.అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రాహుల్ గాంధీ ఆసక్తిగా లేరు. రాహుల్ గాంధీని ఈ పదవిని చేపట్టాలని కొందరు నేతలు చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తామన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.దీంతో సోనియా గాంధీ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

కాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ రేసులో ముందున్నారు. ఈ పదవికి రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ పోటీ చేసేందుకు సుముఖంగా లేకపోవడంతో శశిథరూర్ పోటీకి ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై శశిథరూర్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయమై శశి థరూర్ నిరాకరించారు. అయితే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిష్ఫక్షపాతంగా, స్వేచ్ఛగా జరగాలని ఆయన కోరారు.ఈ మేరకు మలయాళ దినపత్రిక మాతృభూమిలో ఆయన ఓ వ్యాసం రాశారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే వర్కింగ్ కమిటీలోని 12 స్థానాలకు కూడా ఎన్నికలను ప్రకటించాల్సి ఉందని ఆ ఆర్టికల్ లో శశిథరూర్ వ్యాఖ్యానించారు.పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం సోనియాగాంధీకి లేఖ రాసిన జీ 23 నేతల్లో శశిథరూర్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడం పార్టీ పునరుజ్జీవానికి నాంది అని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల వల్ల అనేక ప్రయోజనాలున్నాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

బ్రిటీష్ కన్జర్వేటివ్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు. థెరిసా మే స్థానంలో డజనుకు పైగా మంది పోటీ పడగా బోరిస్ జాన్సన్ అగ్రస్థానంలో నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి దృష్ట్యాంతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో అమలు చేయడం ద్వారా పార్టీ వైపునకు ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన ఆ ఆర్టికల్ లో రాశారు. దీంతో చాలా మంది అభ్యర్ధులు పోటీకి ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే జరిగితే దేశంలో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీలో పరిణామాలపై ఆసక్తిని చూపుతారని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న స్థితి,సంక్షోభం నేపథ్యంలో ఎవరు పార్టీ పగ్గాలు చేపట్టినా నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను ఉత్తేజపర్చడంతో పాటు ఓటర్లను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ వ్యాసంలో శశిథరూర్ చెప్పారు.పార్టీ పగ్గాలు చేపట్టే నేత ఎవరైనా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను సరిదిద్దాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement