Monday, April 29, 2024

ప్రతి దళిత కుటుంబాలనికి దళితబంధు.. ఓట్ల కోసం కాదన్న మంత్రులు

దళిత కుటుంబాల ఆర్ధిక అభ్యున్నతిని కాంక్షిస్తూ కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకం అమలుకు సంకల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని మంత్రులు కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న దళిత బందు పథకం కింద మంజూరైన యూనిట్లను కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు ట్రాక్టర్లు, మినీ వ్యాన్ లు, రవాణా వాహనాలను మంత్రులు పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఈ సారి మొత్తం 5500 మందికి లబ్ధి జరిగిందన్నారు. రానున్న విడతలో ఒక్కో నియోజకవర్గంకు 1500 చొప్పున ఉమ్మడి జిల్లాలో 15 వేల మందికి లబ్ధి చేకురనుందని వెల్లడించారు. దళితుల సమగ్ర అభ్యున్నతి కోసం ఉద్దేశించిన దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని, తమ కాళ్ళ మీద తామే నిలబడినప్పుడే ఈ పథకానికి సార్థకత అవుతుందన్నారు.

ప్రయోగాత్మంగా ముందుగా నియోజకవర్గంకు 100 చొప్పున దళిత బందు అమలు చేశామని, రానున్న రోజుల్లో ప్రతి దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుందని, ఈ విషయంలో ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి పువ్వాడ భరోసా కల్పించారు. దళిత కుటుంబాలు తమ కాళ్ళపై తాము నిలదొక్కుకుని సమాజంలోని అన్ని వర్గాల వారితో సమానంగా ఆర్ధిక ప్రగతిని సాధించాలని, మరో పది మందికి ఉపాధి కల్పించాలనే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. దళారుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా, ఏ దశలోనూ అవినీతి, అక్రమాలకు తావు ఉండరాదనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ గారు ఎలాంటి ఆంక్షలు, పరిమితులు విధించకుండా లబ్ధిదారుల పేరిట నేరుగా ఖాతాల్లో నిధులు జమ చేయించారని, తొలి విడత కింద జిల్లాకు ఇప్పటికే నిధులు మంజూరై సిద్ధంగా ఉన్నాయని మంత్రి వివరించారు.

తెలంగాణ రాష్ట్రం అధ్భుత ప్రగతితో ముందుకు పోతుందని, యువతకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, 80వేలకు పైగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. సాధించుకున్న తెలంగాణలో 11 జిల్లాలను 31 జిల్లాలుగా ఎర్పాటు చేసుకొని అద్భుతంగా అభివృద్ది చేసుకున్నామని అన్నారు. ఇదేదో రాజకీయ లబ్ది కోసమో, ఓట్ల కోసమో ప్రవేశపెట్టలేదని, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సమాజంలోని వివిధ వర్గాల వారితో చర్చోపచర్చలు జరిపి ఎంతో మేధోమధనం చేసిన తరువాతనే దళితబంధుకు రూపకల్పన చేశారని తెలిపారు.

అరవై సంవత్సరాలుగా దళితుల కోసం అనేక పథకాలు అమలైనప్పటికీ సమాజంలో ఇంకనూ అత్యధిక మంది దళితులు అట్టడుగునే ఉన్నారని అన్నారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత స్థాయిలో వివిధ వర్గాలకు చెందిన వారితో సమాలోచనలు జరిపి పక్క ప్రణాళికతో దళిత బంధు కార్యక్రమాన్ని రూపొందించారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మనసుపెట్టి ఆచరణలోకి తెచ్చిన పథకం ఇది అని పేర్కొన్నారు. ఎలాంటి బ్యాంకు గ్యారెంటీలు,  ష్యురిటీలు, బ్యాంకు కాంసేంట్ లేకుండానే నేరుగా లబ్ధిదారులకు పది లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేసే పథకం దేశంలోనే మరెక్కడా లేదన్నారు.  

లబ్ధిదారులు ఈ మొత్తాన్ని తమకు నచ్చిన వ్యాపార రంగంలో పెట్టుబడిగా పెట్టి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని, తద్వారా మరో పది మందికి ఉపాధి కల్పించాలన్నదే దళిత బంధు పథకం ఉద్దేశ్యమని చెప్పారు. ప్రయోగాత్మకంగా తొలివిడతలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వంద మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేసి ప్రస్తుతం యూనిట్లను మంజూరు చేస్తున్నామన్నారు. వీటి స్థాపన పూర్తయిన వెంటనే మరో రెండు నెలల వ్యవధి లోపే మలి విడత కింద ఒక్కో సెగ్మెంట్ నుండి రెండు వేల మంది లబ్ధిదారులను దళిత బంధు కింద ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలనే తపనతో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల వారి కోసం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ విధివిధానాలను అనుసరిస్తూ ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇప్పటికే వారు కోరుకున్న రంగాల్లో వ్యాపారాలు స్థాపించేందుకు వీలుగా శిక్షణ ఇప్పించామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement